అధ్యాత్మ సంకీర్తన
రేకు: 12-4
సంపుటము: 1-75
రేకు: 12-4
సంపుటము: 1-75
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుఁడీ తిరువేంకటాద్రివిభుఁడు | ॥నిత్యాత్ము॥ |
ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ- డేమూర్తి నిజమోక్షమియ్యఁజాలెడునాతఁ- డేమూర్తి లోకైకహితుఁడు యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁ గాఁడు యేమూర్తి త్రైమూర్తి లేకమైనయాతఁ- డేమూర్తి సర్వాత్ముఁ డేమూర్తి పరమాత్ముఁ- డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు | ॥నిత్యాత్ము॥ |
యేదేవు దేహమున నిన్నియును జన్మించె నేదేవు దేహమున [1]నిన్నియును నణఁగె మరి యేదేవు విగ్రహం బీసకల మింతయును యేదేవు నేత్రంబు లినచంద్రులు యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు నేదేవు చైతన్య మిన్నిటికి నాధార- మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ [2]డద్వంద్వుఁ- డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు | ॥నిత్యాత్ము॥ |
[2]యేవేల్పు పాదయుగ మిలయు నాకాశంబు యేవేల్పు పాదకేశాంతం బనంతంబు యేవేల్పు నిశ్వాస మీమహామారుతము యేవేల్పు నిజదాసు లీపుణ్యులు యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ- డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు | ॥నిత్యాత్ము॥ |
[1] పెద్దరేకు2 - మేనిలో.
[2] అద్వంద్యు అని రేకు.
[3] ఈ మూడవచరణంలో ఒకటి మూడు పాదముల మధ్యమున నిలువుగీత యున్నది. ఆ దోషము పూ.ము.న పరిష్కరించబడినది.