Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 102-6
సంపుటము: 2-12
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు
యియ్యగొనఁ గర్తలుగా రెఱఁగరు జడులు
॥పల్లవి॥
చుక్కలై యుండినవారు సురలై యుండినవారు
యిక్కడనుండి పోయిన యీజీవులే
దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు
యొక్కుడైన హరి నాత్మ నెఱఁగరు జడులు
॥అయ్యో॥
పాతాళవాసులను పలులోకవాసులును
యీతరవాత నుండిన యీ జీవులే
కాతరాన వారిపుణ్యకతలే వినేరు గాని
యీతల శ్రీహరికత లెఱఁగరు జడులు
॥అయ్యో॥
యిరవెఱిఁగిన ముక్తు లెఱఁగని బద్దులు
యిరవై మనలోనున్న యీజీవులే
సిరుల మించినవాఁడు శ్రీవేంకటేశ్వరుఁడే
శరణాగతులు దక్క చక్కఁ గారు జడులు
॥అయ్యో॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము