అధ్యాత్మ సంకీర్తన
రేకు: 143-1
సంపుటము: 2-189
రేకు: 143-1
సంపుటము: 2-189
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| అన్నియు నడుగవే నేనే మఱచితి నవి హరి నీకే తెలిసినవి మన్నించి నా కీజన్మ మొసఁగితివి మర్మగాఁడు మన్మథుఁడొఁకడు | ॥పల్లవి॥ |
| పలుజన్మంబులు నేఁ ద్రాగిన చనుఁబాలు గొలిచితే నెన్నౌనో తలిదండ్రులు మరియెందరో తా మెక్కడ నున్నారో తిలకింపఁగ నాహారంబునకును తెగినకొలుచు లవి యెన్నెన్నో యిలపై నే బ్రదికినకాలము యెంతని వ్రాసెనో చిత్రగుప్తుఁడు | ॥అన్ని॥ |
| చినుఁగఁగఁ జినుఁగఁగఁ గట్టుకోకలకుఁ జెల్లినపత్తి దా నదియంతో కనక మెంతో నాకాభరణములై కాయంబులతో నొరసినది పెనఁగీ రమించిన కామినీమణుల పేరు లెన్నియో తొల్లిటివి ఘనముగ నను నిటు భోగించఁజేసిన కర్మమే యెఱుఁగు నివియెల్లా | ॥అన్ని॥ |
| గరిమల నే గడియించినయిండ్లుఁ గాణాచిచోట్లు యేడేడో పొరలిన యిడుమలు యెందుకెక్కెనో పొదలితి భువిపై నిన్నాళ్లు అరయఁగ నందరి కంతర్యామిని అఖిలకారణంబును నీవే నిరతపు శ్రీవేంకటేశ్వర దయగల నీచిత్త మెటువలెఁ దలచీనో | ॥అన్ని॥ |


