Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 143-1
సంపుటము: 2-189
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
అన్నియు నడుగవే నేనే మఱచితి నవి హరి నీకే తెలిసినవి
మన్నించి నా కీజన్మ మొసఁగితివి మర్మగాఁడు మన్మథుఁడొఁకడు
॥పల్లవి॥
పలుజన్మంబులు నేఁ ద్రాగిన చనుఁబాలు గొలిచితే నెన్నౌనో
తలిదండ్రులు మరియెందరో తా మెక్కడ నున్నారో
తిలకింపఁగ నాహారంబునకును తెగినకొలుచు లవి యెన్నెన్నో
యిలపై నే బ్రదికినకాలము యెంతని వ్రాసెనో చిత్రగుప్తుఁడు
॥అన్ని॥
చినుఁగఁగఁ జినుఁగఁగఁ గట్టుకోకలకుఁ జెల్లినపత్తి దా నదియంతో
కనక మెంతో నాకాభరణములై కాయంబులతో నొరసినది
పెనఁగీ రమించిన కామినీమణుల పేరు లెన్నియో తొల్లిటివి
ఘనముగ నను నిటు భోగించఁజేసిన కర్మమే యెఱుఁగు నివియెల్లా
॥అన్ని॥
గరిమల నే గడియించినయిండ్లుఁ గాణాచిచోట్లు యేడేడో
పొరలిన యిడుమలు యెందుకెక్కెనో పొదలితి భువిపై నిన్నాళ్లు
అరయఁగ నందరి కంతర్యామిని అఖిలకారణంబును నీవే
నిరతపు శ్రీవేంకటేశ్వర దయగల నీచిత్త మెటువలెఁ దలచీనో
॥అన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము