| కవితలు | ఆంధ్రావళి - ప్రబోధము - రాయప్రోలు | పుస్తకము |
| 4. పుస్తకము |
|
నిండాఱ బాఱు నఖండగోదావరిన్ దాగిన చాళుక్యనాగరికత, పాడైన పెనుకోటగోడల దీర్ఘనిద్రలు వోవు కాకతి ప్రాభవమ్ము, పల్లెపదాల జీవము నిల్పికొన్న పల్నాటివీరుల రక్తనాళపటిమ, కడలేక యేడ్చు తుంగభద్ర కెరటాల మణగిన ప్రాజ్య సామ్రాజ్యభరము, |
|
హృదయములు విన పలుకక చదువు చెప్పు పుస్తకతపస్విని తెనుంగు పూలపొదల నిలిచి సేవాశుకమ్ములన్ పిలిచి పిలిచి తిరుగ పాడించు గాత జాతీయగీతి. |
|
ఆచారమునకు దాస్యము చేయుచును వంటయిలు దాటి రాని పూర్ణేందుముఖుల, ఉదయాస్తమయములు నొడలి చెమ్మటలోడ్చి క్షేత్ర సేవలు చేయు సేద్యగాండ్ర, బ్రతికినన్నాళ్ళు తీరనికస్తి రెక్కలు విరిచి జీవించెడు పేదజనుల, తను వచోవీధులన్ తాకరా దనుచు దుర్గతుల ద్రోసిన చెప్పరానివాండ్ర, |
|
పూలతో నిండి కమ్మదనాలు చిమ్ము పుస్తక నికుంజపుంజాళి పొంత బిలిచి 'నా జనము, నాదుదేశ' మనంగ జాలు ఇంత జ్ఞానభిక్షాదాన మిమ్ము తల్లి! |
|
ఆంధ్రుల శిల్ప విన్యాసంబు చూపించు కలిమి గోపురములన్ గల దటంచు, ఆంధ్రనాగరిక కళ్యాణచిహ్నములైన గానసాహిత్యముల్ గల వటంచు ఆంధ్ర భాగ్యమ్ము మోయగ గౌతమీ కృష్ణ దరులను నావలు తిరిగె ననుచు, ఆంధ్రవీరులకు స్వర్గాతిథ్యమిచ్చి పాటలు పాడిన యుగమ్ము కల దటంచు, |
|
చెప్పి యొప్పించు పుస్తక శ్రీకుమారి యందగింపగ గల యాలయములు గట్టు డాంధ్రదేశమునం దెల్ల నాంధ్రపుత్రు లాప్తమానవసంఘ సేవానురక్తి. |