| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| క. |
మృగయులు మెచ్చ నరేంద్రుఁడు, మృగరాజు పరాక్రమమున మెఱసి హరించెన్ మృగధర మండలమునఁ గల, మృగ మొక్కటి దక్క సర్వమృగముల నెల్లన్. |
456 |
| వ. | ఇట్లు వాటంబయిన వేఁటతమకంబున మృగంబుల వెంబడిం బడి యెగచుచుం జరించుటం జేసి బుభుక్షాపిపాసల వలన మిగులఁ బరిశ్రాంతుండయి ధరణీకాంతుండు చల్లని నీటికొలంకులు గానక కలంగెడు చిత్తంబుతోఁ జని యొక్క తపోవనంబు గని యందు. | 457 |
| సీ. |
మెలఁగుట చాలించి మీలితనేత్రుఁడై శాంతుఁడై కూర్చుండి జడత లేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగవీథులఁ బాఱనీక జాగరణాదిక స్థానత్రయము దాఁటి పరమమై యుండెడి పదముఁ దెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త్యవిక్రియుఁ డయి యతిదీర్ఘజటలుఁ ద న్నావరింప |
|
| తే. |
నలఘు రురు చర్మధారియై యలరుచున్న, తపసిఁ బొడగని శోషితతాలుఁ డగుచు నెండి తడిలేక కుత్తుక నెలుఁగు డింద, మందభాషల నిట్లను మనుజవిభుఁడు. |
458 |
| క. |
తోయములు దెమ్ము మా కీ, తోయము వేఁటాడ వెరవు దొరకదు ఘన చే తోయుత! డప్పి జనించెను, తోయము వారలును లేరు దుస్సహ మనఘా! |
459 |
| వ. | అని భూవరుండు శమీకమహాముని సమాధి నిష్ఠానిమీలిత నేత్రుండును విస్మృత బాహ్యాంతరింద్రియ కృత సంచారుండును హరిచింతాపరుండునునై యుండుటం దెలియలేక. | 460 |
| ఉ. |
కన్నులు మూసి బ్రాహ్మణుఁడు గర్వముతోడుత నున్న వాఁడు, చే సన్నల నైన రమ్మనఁడు, సారజలంబులు దెచ్చి పోయఁ డే మన్ననలైనఁ జేయఁడు, సమగ్రఫలంబులు వెట్టఁడింత సం పన్నత నొందెనే తన తపశ్చరణాప్రతిమ ప్రభావముల్. |
461 |
| ఆ. |
వారిఁగోరుచున్న వారికి శీతల, వారి యిడుట యెట్టివారి కయిన వారితంబుగాని వలసిన ధర్మంబు, వారి యిడఁడు దాహవారి గాఁడు. |
462 |
| చ. |
అని మనుజేశ్వరుండు మృగయాపరిఖేద నితాంత దాహ సం జనిత దురంత రోషమున సంయమి దన్నుఁ దిరస్కరించి పూ జనములు సేయఁడంచు మృతసర్పము నొక్కటి వింటికోపునం బనివడి తెచ్చి వైచె నటు బ్రహ్మమునీంద్రుని యంసవేదికన్. |
463 |
| వ. | ఇట్లతండు ప్రత్యాహృత బాహ్యాంతరింద్రియుం డగుట నిమీలితలోచనుండు గా నోపునో యట్లుగాక గతాగతులగు క్షత్త్రబంధులచే నేమియని మృషాసమాధి నిష్ఠుండు గానోపునో, యని వితర్కించుచు వృథారోష దర్పంబున ముని మూఁపున గతాసువయిన సర్పంబు నిడి నరేశ్వరుండు దనపురంబునకుం జనియె; నంత సమీపవర్తులైన మునికుమారు లంతయుం దెలియం జూచి శమీకనందనుండైన శృంగికడకుం జని. | 464 |