| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| తే. |
‘కృతమ కాని కర్తవ్యంబు గృతయుగంబు | నందు లేదు; చతుష్పాద మగుచు ధర్మ మనఘ! వర్తిల్లు; నచ్యుతుం డయ్యుగమున | శుక్లవర్ణుఁడై ప్రజలఁ గాచుచు వెలుంగు. |
336 |
| వ. | అది సనాతనధర్మసనాథం; బందుల బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రు లేకవేదక్రియాయోగ్యులై యకామ ఫలసంయోగంబునఁ బుణ్యలోకంబులు వడయుదు; రందు నసూయాభిచార దర్పపైశున విగ్రహ క్రోధమదమత్సర భయ సంతాప వ్యాధి ప్రజాక్షయేంద్రియక్షయంబులు లేవు; మఱియుఁ ద్రేతాయుగంబునందుఁద్రిపాదంబై ధర్మువు వర్తిల్లు; నందు జనులు నిత్యసత్యవ్రతశీలురై యజ్ఞతపో దానాది క్రియల వర్తింతు; రందు రక్తవర్ణుండయి విష్ణుభట్టారకుండు ప్రజారక్షణంబుఁ జేయు. | 337 |
| తే. |
ద్వాపరంబున రెండుపాదములఁ జేసి | నడుచు ధర్మువు వేదముల్ నాల్గుదెఱఁగు లై ప్రవర్తిల్లు వేదశాస్త్రార్థ చోది | తంబులై ధర్మకామముల్ ధరణిఁ బరఁగు. |
338 |
| తే. |
సత్యశమహీను లగుదురు జనులు గామ | కాములై చేయుదురు బహుక్రతువు లోలి; నందుఁ ద్రైలోక్యవందితుం డచ్యుతుండు | కృష్ణవర్ణుఁడై జగము రక్షించు మఱియు. |
339 |
| క. |
కలియుగమునందు ధర్మము | బలమఱి వర్తిల్లు నేకపాదంబున; నం దలఘుఁడు కృష్ణుఁడు జగతీ | వలయము రక్షించుఁ బీతవర్ణుం డగుచున్. |
340 |
| వ. | అందుల జనులు తమోగుణ యుక్తులై కామక్రోధాది దోషవశంబునం దమ్మెఱుంగక యధర్మవర్తు లగుదు; రందుఁ జేసిన తపోదానాది కర్మంబులు స్వల్పంబులయ్యును బహుఫలంబు లగు’ నని యుగవర్తన ప్రకారంబులఁ జెప్పి, ‘నీ కిష్టావాప్తి యయ్యెడు, నరుగు’ మనిన భీముం డిట్లనియె. | 341 |