| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అనిన విని పాండవాగ్రజుండు ‘బండారంబు గలిగించు వెరవెట్టిది తెలుపు’మని యడిగిన నాపగాతనయుం డతని కిట్లనియె. | 390 |
| క. |
‘విను కర్షకులును వణిజులు | ననఘా! గోరక్షకులు ధరాధీశునకున్ ధన మొడఁ గూడెడు చోటుల | ననేక విధములకు నెల్ల నాద్యస్థలముల్. |
391 |
| తే. |
ధనములకు ధాన్యములకు నుత్పత్తి తలము | లయినవాని కించుకయును హాని గాక యుండఁ దనకును బండార మొదవఁ దగు ను | పార్జనము సేయవలయు భూపాలకుండు. |
392 |
| క. |
పులి గూనల దినుచందము | గలిగిన నంతటన నిలుచుఁ గాక ధనంబుల్ గలుగునె మీఁదం గావున | జలగ దిగిచినట్లు గొనఁగఁ జను నిల సొమ్ముల్. |
393 |
| క. |
అరయుటఁ బ్రజ వర్ధింపఁగ | నరి యేఁటఁ గ్రమ ప్రవృద్ధ మౌనట్టులుగా నరపతికిఁ గొనఁగ వచ్చు | న్వెరవులఁ బెంపంగఁ జాల నెఱయు ధనంబుల్. |
394 |
| క. |
దమియింపఁ దగిన వారల | సమయమున దమించి, వారి సంపదలు మహీ రమణుండు దనదు బండా | రముగా సమకూర్చు జనము రాగిల్లంగన్. |
395 |
| క. |
ఆ పనికిఁ గీడు రోయుచు | భూపాలుఁడు ధనము గలుగు పురుషుల సిరిఁ దా జూ పోపక కొనఁ దగదు, ద | యాపరుఁడై పెంపవలయు నఖిలజనములన్. |
396 |
| క. |
ప్రభువుల నుపచారంబుల | విభుఁ డనురాగిల్లఁ జేసి వెదగొనుఁ గాఁపుల్ సభయులు గాకుండ ధనం | బుభయ జగత్సిద్ధి పొంటె నుర్వీనాథా! |
397 |
| క. |
ఆయతి కిమ్మెయిఁ గలుగు ను | పాయంబులు ధర్మమార్గ ఫలితంబులుగాఁ జేయుటయును మేలు నృపతికి | మాయాకృతి నిపుణు డగుట మతిగాదు సుమీ! |
398 |
| క. |
ధనము సవరించినఁ బ్రయో | జన మేమి యపాత్రములకుఁ జల్లి చెఱుచు నే ని నరేంద్రముఖ్య! వ్యయములు | విను రక్షయ సిరికిఁ బాత్ర విషయము లైనన్. |
399 |
| వ. | ఈ భంగి యైనం గోశ మిత్త్ర రాష్ట్ర బలంబులు వృద్ధిఁ బొందు; నీ విట్టి తెఱంగువాఁడవై ప్రజల రక్షింపుము. రణంబుల కలయక విరోధుల వధియింపుము మఖంబు లొనరింపుము ; దరిద్రులైన ధరణీసురాది సాధుల నరసి కుటుంబ రక్షణంబు సేయుము; మాంధాతృనకు నాంగిరసుం డగు నుతథ్యుండు సెప్పిన హిత వాక్యంబు లుపన్యసించెద; నాకర్ణింపుము. | 400 |