పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
ధ్రువోపాఖ్యానము
క. విను మఖిలభువనపరిపా, లనమునకై చక్రధరకళాకలితుండై
వనజజునకు స్వాయంభువ, మను వపు డుదయించెఁ గీర్తిమంతుం డగుచున్‌.
216
తే. రూఢి నమ్మనువుకు శతరూపవలన, భూనుతులగు ప్రియవ్రతోత్తానపాదు
లనఁగ నిద్దఱు పుత్త్రులై రందులోన, భవ్యచారిత్రుఁ డుత్తానపాదునకును.
217
క. వినుము సునీతియు సురుచియు, నను భార్యలు గలరు; వారియందును ధ్రువునిం
గనిన సునీతియు నప్రియయును, సురుచియుఁ బ్రియయు నగుచు నున్నట్టి యెడన్‌.
218
సీ. ఒకనాఁడు సుఖలీల నుత్తానపాదుండు నెఱిఁ బ్రియురాలైన సురుచి గన్న
కొడుకు నుత్తముఁ దన తొడలపై నిడికొని యుపలాలనము సేయుచున్న వేళ
నర్థిఁ దదారోహణాపేక్షితుం డైన ధ్రువునిఁ గనుంగొని తివక యాద
రింప కుండుటకు గర్వించి యా సురుచియు సవతిబిడ్డండైన ధ్రువునిఁ జూచి
 
తే. తండ్రి తొడ నెక్కు వేడుక దగిలెనేనిఁ, బూని నాగర్భమున నాఁడు పుట్ట కన్య
గర్భమునఁ బుటఁ గోరినఁ గలదె నేఁడు, జనకు తొడ యెక్కు భాగ్యంబు సవతికొడుక!
219
క. అది గాన నీ వధోక్షజు, పదపద్మము లాశ్రయింపు; పాయక హరి నా
యుదరమునఁ బుట్టజేయును, వదలక యట్లయిన ముదము వడసెద వనఘా!
220
క. అని యీ రీతి నసహ్య వ, చనములు పినతల్లి యపుడు జనకుఁడు వినఁగాఁ
దను నాడిన దుర్భాషా, ఘనశరములు మనము నాఁటి కాఱియ వెట్టన్‌.
221
క. తను నట్లుపేక్ష సేసిన, జనకునికడఁ బాసి దుఃఖజలనిధి లోనన్‌
మునుఁగుచును దండతాడిత, ఘనభుజగముఁ బోలె రోషకలితుం డగుచున్‌.
222
క. ఘనరోదనంబు సేయుచుఁ, గనుఁగవలను శోకబాష్పకణములు దొరఁగన్‌
జనని కడ కేగుటయు నిజ, తనయునిఁగని యా సునీతి దద్దయుఁబ్రేమన్‌.
223
వ. తొడలపై నిడికొని. 224
క. కర మనురక్తిని మోము ని, విరి తద్వృత్తాంత మెల్ల వెలఁదులు నంతః
పురవాసులుఁ జెప్పిన విని, పఱపుగ నిట్టూర్పు లెసఁగ బాష్పాకులయై.
225
తే. సవతి యాడిన మాటలు సారెఁ దలఁచి, కొనుచుఁ బేర్చిన దుఃఖాగ్నిఁ గుములుచుండె
దావపావకశిఖలచేఁ దగిలి కాంతి, వితతిఁ గందిన మాధవీలతికవోలె.
226
వ. అంత నా సునీతి బాలకునిం జూచి తండ్రీ! దుఃఖింపకుమని యిట్లనియె. 227
క. అనఘా! యీ దుఃఖమునకుఁ, బని లే దన్యులకు సొలయ బలవంతంబై
తన పూర్వజన్మదుష్కృత, ఘనకర్మము వెంట నంటఁగా నెవ్వలనన్‌.
228
వ. కావున. 229
క. పెనిమిటిచేతను బెండ్లా, మని కాదు నికృష్టదాసి యనియును బిలువం
గను జాలని దుర్భగురా, లనఁగల నా కుక్షి నుదయ మందిన కతనన్‌.
230
క. నిను నాడిన యా సురుచి వ, చనములు సత్యంబు లగును; సర్వశరణ్యుం
డనఁగల హరిచరణంబులు, గను జనకుని యంక మెక్కఁగాఁ దలఁ తేనిన్‌.
231
వ. కావునం బినతల్లియైన యా సురుచి యాదేశంబున నధోక్షజు నాశ్రయింపు మని వెండియు నిట్లనియె. 232
సీ. పరికింప నీ విశ్వపరిపాలనమునకై యర్థి గుణవ్యక్తుఁడైనయట్టి
నారాయణుని పాదనలినముల్‌ సేవించి తగ బ్రహ్మ బ్రహ్మపదంబు నొందె;
ఘనుఁడు మీ తాత యా మనువు సర్వాంతర యామిత్వ మగు నేకమైన దృష్టిఁ
జేసి యాగముల యజించి తా భౌమసుఖములను దివ్యసుఖముల మోక్ష
 
తే. సుఖములను బొందె నట్టి యచ్యుతునిఁ బరుని, వితతయోగీంద్రనికరగవేష్యమాణ
చరణసరసిజయుగళు శశ్వత్ప్రకాశు, భక్తవత్సలు విశ్వసంపాద్యు హరిని.
233
వ. మఱియును. 234
క. కరతలగృహీతలీలాం, బురుహ యగుచుఁ బద్మగర్భముఖగీర్వాణుల్‌
పరికింపంగల లక్ష్మీ, తరుణీమణిచేత వెదకఁదగు పరమేశున్‌.
235
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )