పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట
సీ. అని యిట్లు చింతించె ననుచు నమ్మైత్రేయముని విదురునకు నిట్లనియెఁ దండ్రి!
కమనీయహరిపాదకమలరజో0000భిసంస్కృతశరీరులును యాదృచ్ఛికముగ
సంప్రాప్తమగు దాన సంతుష్టచిత్తులై వఱలుచు నుండు మీ వంటి వారు
దగ భగవత్పాదదాస్యంబు దక్కంగ నితర పదార్థంబు లెడఁదలందు
 
తే. మఱచియును గోర నొల్లరు మనుచరిత్ర!, తవిలి యిట్లు హరిప్రసాదంబు నొంది
మరలి వచ్చుచు నున్న కుమారు వార్తఁ, జారుచే విని యుత్తానచరణుఁ డపుడు.
301
వ. మనమున నిట్లని తలంచె. 302
క. చచ్చిన వారలు గ్రమ్మఱ, వచ్చుటయే కాక యిట్టి వార్తలు గలవే?
నిచ్చలు నమంగళుఁడ నగు, నిచ్చట మఱి నాకు శుభము లేల ఘటించున్‌.
303
క. అని విశ్వసింపకుండియు, మనమున నా నారదుఁడు “గుమారుఁడు వేగం
బునఁ రాఁగలఁ” డనుచును బలి, కిన పలుకులు దలఁచి నమ్మి కృతకృత్యుండై.
304
క. తన సుతుని రాక సెప్పిన, ఘనునకు ధనములును మౌక్తికపు హారములున్‌
మన మలర నిచ్చి తనయునిఁ, గనుఁగొను సంతోష మాత్మఁ గడలుకొనంగన్‌.
305
సీ. వలను మీఱిన సైంధవంబులఁ బూన్చిన కనకరథంబు నుత్కంఠ నెక్కి
బ్రాహ్మణకులవృద్ధబంధుజనామాత్యపరివృతుం డగుచు విస్ఫురణ మెరసి
బ్రహ్మనిర్ఘోషతూర్యస్వనశంఖకాహళవేణురవము లందంద చెలఁగ
శిబిక లెక్కియు విభూషితలై సునీతి సురుచు, లుత్తముండు నారూఢి నడవఁ
 
తే. గరిమ దీపింప నతిశీఘ్రగమన మొప్ప, నాత్మనగరంబు వెలువడి యరుగుచుండి
బలసి నగరోపవన సమీపంబునందు, వచ్చు ధ్రువుఁ గని మేదినీశ్వరుఁడు నంత.
306
చ. అరదము డిగ్గి ప్రేమ దొలఁకాడ ససంభ్రముఁడై రమామనో
హరచరణారవిందయుగళార్చననిర్దళితాఖిలాఘు నీ
శ్వరకరుణావలోకనసుజాతసమగ్రమనోరథున్‌ సుతుం
గర మనురక్తి డాసి పులకల్‌ ననలొత్తఁబ్రమోదితాత్ముఁడై.
307
తే. బిగియఁగౌఁగిటఁజేర్చి నెమ్మొగము నిమిరి, శిరము మూర్కొని చుబుకంబు చేతఁబుణికి
యవ్యయానందబాష్పధారాభిషిక్తుఁ, జేసి యాశీర్వదింప నా చిరయశుండు.
308
క. జనకుని యాశీర్వచనము, లనయముఁ గైకొని ప్రమోదియై తత్పదముల్‌
దన ఫాలతలము సోఁకఁగ, వినతులు గావించి భక్తివిహ్వలుఁ డగుచున్‌.
309
తే. అంత నా సజ్జనాగ్రణియైన ధ్రువుఁడు, దల్లులకు భక్తివినతులు దగ నొనర్చి
సురుచికిని మ్రొక్క నర్భకుఁ జూచి యెత్తి, నగుమొగంబున నాలింగనంబు సేసి.
310
సీ. కరమొప్ప నానందగద్గదస్వరమున జీవింపు మనుచు నాశీర్వదించె;
భగవంతుఁడెవ్వనిపై మైత్రి వాటించు సత్కృపానిరతిఁ బ్రసన్నుఁడగుచు
నతనికిఁ దమయంత ననుకూలమై యుండు సర్వభూతంబులు సమతఁ బేర్చి;
మహిఁ దలపోయ నిమ్నప్రదేశమునకు ననయంబుఁజేరు తోయములపగిదిఁ
 
తే. గాన ఘను న మ్మహాత్ముని గారవించె, సురుచి పూర్వంబు దలఁపక సుజనచరిత!
విష్ణు భక్తులు ధరను బవిత్రు లగుట, వారి కలుగరు ధరణి నెవ్వారు మఱియు.
311
వ. కావున నుత్తముండును ధ్రువుండును బ్రేమవిహ్వలు లగుచు నన్యోన్యాలింగితులై పులకాంకురాలం కృతశరీరులై యానందబాష్పముల నొప్పి; రంత సునీతియుం దన ప్రాణంబుల కంటెఁ బ్రియుండైన సుతు నుపగూహనంబు సేసి తదవయవస్పర్శనంబుచేత నానందంబు నొంది విగతశోక యయ్యె; నప్పుడు సంతోషబాష్పధారాసిక్తంబులై చనుఁబాలునుంగురిసె నంత. 312
సీ. ఉన్నతసంతోషముప్పతిల్లఁగఁ బౌర జనము లా ధ్రువుతల్లి నెనయఁ జూచి
తొడరిన భవదీయదుఃఖనాశకుఁడైన యిట్టి తనూజుఁ డెందేని పెద్ద
కాలంబు క్రిందటఁ గడఁగి నష్టుం డైన వాఁడిప్డు నీ భాగ్యవశము చేతఁ
బ్రతిలబ్ధుఁ డయ్యెను; నితఁడు భూమండల మెల్లను రక్షించు నిద్ధమహిమఁ;
 
తే. గమలలోచనుఁ జింతించు ఘనులు లోక, దుర్జయం బైన యట్టి మృత్యువును గెల్తు;
రట్టి ప్రణతార్తిహరుఁడైన యబ్జనాభుఁ, డర్థి నీచేతఁ బూజితుండగుట నిజము.
313
వ. అని ప్రశంసించి, రట్లు పౌరజనంబులచేత నుపలాల్యమానుండగు ధ్రువుని నుత్తానపాదుం డుత్తమ సమేతంబుగా గజారూఢునింజేసి సంస్తూయమానుండును, ప్రహృష్టాంతరంగుండును నగుచు బురాభిముఖుండై చనుదెంచి. 314
సీ. స్వర్ణపరిచ్ఛదస్వచ్ఛకుడ్యద్వారలాలితగోపురాట్టాలకంబు
ఫలపుష్పమంజరీకలితరంభాస్తంభపూగపోతాదివిభూషితంబు
ఘనసారకస్తూరికాగంధజలబంధురాసిక్తవిపణిమార్గాంచితంబు
మానితనవరత్నమయరంగవల్లీవిరాజితప్రతిగృహప్రాంగణంబు
 
తే. శుభనదీజలకుంభసంశోభితంబు, తండులస్వర్ణలాజాక్షతప్రసూన
ఫలబలివ్రాతకలితవిభ్రాజితంబు, నగుచు సర్వతో0000లంకృత మైన పురము.
315
వ. ప్రవేశించి రాజమార్గంబునఁ జనుదెంచు నప్పుడు. 316
మ. హరిమధ్యల్‌ పురకామినీతతులు సౌధాగ్రంబులందుండి భా
స్వరసిద్ధార్థఫలాక్షతప్రసవదూర్వావ్రాతదధ్యంబువుల్‌
గరవల్లీమణిహేమకంకణఝణత్కారంబు శోభిల్లఁ జ
ల్లిరి యా భాగవతోత్తమోత్తమునిపై లీలానుమేయంబుగన్‌.
317
వ. ఇట్లు వాత్సల్యంబునం జల్లుచు సత్యవాక్యంబుల దీవించుచు సువర్ణ పాత్ర రచితమణి దీప నీరాజనంబుల నివాళింపం బౌరజానపదమిత్రామాత్యబంధుజనపరివృతుండై చనుదెంచి. 318
సీ. కాంచనమయమరకతకుడ్యమణిజాల సంచయరాజితసౌధములను
వరసుధాఫేనపాండురరుక్మపరికరోదాత్త పరిచ్ఛదతల్పములను
సురతరుశోభితశుకపికమిథునాళి గానవిభాసితోద్యానములను
సుమహితవైదూర్యసోపానవిమల శోభితజలపూర్ణవాపీచయముల
 
తే. వికచకహ్లారదరదరవింద కైర, వ ప్రదీపితబకచక్రవాకరాజ
హంససారసకారండవాదిజలవి, హంగనినదాభిరామపద్మాకరముల.
319
వ. మఱియును. 320
తే. చారుబహువిధవస్తువిస్తార మొప్ప, నంగనాయుక్త మగుచుఁ బెంపగ్గలించి
యర్థిఁ దనరారు జనకు గృహంబు సొచ్చె, నెలమిఁ ద్రిదివంబు సొచ్చు దేవేంద్రు పగిది
321
వ. ఇట్లు ప్రవేశించిన రాజర్షియైన యుత్తానపాదుండు సుతుని యాశ్చర్యకరంబైన ప్రభావంబు వినియుం జూచియు మనంబున విస్మయంబు నొంది ప్రజానురక్తుండును బ్రజాసమ్మతుండును నవయౌవన పరిపూర్ణుండును నైన ధ్రువుని రాజ్యాభిషిక్తుంజేసి వృద్ధవయస్కుండైన తన్నుం దాన యెఱింగి యాత్మగతిఁ బొంద నిచ్ఛయించి విరక్తుండై వనంబునకుం జనియె; నంత నా ధ్రువుండు శింశుమార ప్రజాపతికూఁతురైన భ్రమి యనుదాని వివాహంబై దానివలనఁ గల్పవత్సరు లను నిద్దఱు గొడుకులం బడసి వెండియు వాయుపుత్రియైన యిల యను భార్య యందు నుత్కలనామకుండైన కొడుకు నతిమనోహర యైన కన్యారత్నంబును గనియె; నంతఁ దద్భ్రాతయైన యుత్తముండు వివాహంబు లేకుండి మృగయార్థంబు వనంబున కరిగి హిమవంతంబున యక్షుని చేత హతుం డయ్యె; నతని తల్లియుఁ దద్దుఃఖంబున వనంబున కేఁగి యందు గహన దహనంబున మృతిం బొందె; ధ్రువుండు భ్రాతృమరణంబు విని కోపామర్ష శోకవ్యాకులిత చిత్తుండై జైత్రంబను రథంబెక్కి యుత్తరాభిముఖుండై చని హిమవద్ద్రోణియందు భూతగణసేవితంబును గుహ్యకసంకులంబును నైన యలకాపురంబు వొడగని యమ్మహాబాహుండు. 322
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )