పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
కిమ్మీరుఁడను రాక్షసుఁడు భీముచేఁ జచ్చుట (సం. 3-12-42)
ఉ. ఘోరపరాక్రముల్‌ ప్రబలకోపపరుల్‌ పృథుసారభూరిభూ
మీరుహపాణు లుద్ధతు లమిత్రవిఘాతులు వీరబృందబృం
దారకు లార్చు చొండొరులఁ దాఁకిరి దారుణభంగిఁ బొంగి కి
మ్మీర సమీరసూనులు సమీరవిధూతపయోధులట్ల యై.
117
తరలము పొరిని వారల చేతి యున్నతభూరుహాయుధముల్‌ పర
స్పర కఠోరశిరస్స్థలంబులపై వడిం బడి మత్తకుం
జర శిరఃపతితంబులైన లసన్మృణాలములట్ల జ
ర్జరిత మయ్యెఁ దదారవప్రతిశబ్ద మొప్ప నభంబునన్‌.
118
వ. ఇ ట్లొక్క ముహూర్తంబు వృక్షయుద్ధంబు సేసి యాసన్నమహీరుహంబులు సమసిన నయ్యిద్దఱు శిలాయుద్ధంబునకుఁదొడంగి చేయునెడం బవనజనిక్షిప్త నిష్ఠుర శిలాహత హృదయుండై భానుంబట్టుకొను స్వర్భానుండునుం బోలెఁ గిమ్మీరుండు భీముం బట్టుకొనిన భీముండును వాని హీనబలుంగా నెఱింగి కృతాంతదండానుకారంబులైన తన బాహుదండంబుల నమ్మనుజకంటకు కటి కంఠ ప్రదేశంబులు పట్టుకొని నేలంబెట్టి దేహయష్టి విఱిచి బకుం జంపిన విధంబునఁ గిమ్మీరు విగతప్రాణుం జేసి. 119
తే. ‘బక హిడింబులు హతులైనఁ బనవి పనవి | యఱచి శోకింపఁ గానక యమపురమున
కరిగి తక్కట రాక్షస!’ యనుచుఁ దెరువు | వాయఁ బావని దత్కళేబరము వైచె.
120
వ. ఇట్లు ధర్మరాజువచనంబునఁ గిమ్మీరు నశ్రమంబున వధియించి తద్వనవాసులకు రాక్షసభయం బుడిపిన మహావీరు నమ్మారుతాత్మజు ధర్మార్జుననకులసహదేవులును ధౌమ్యాది మహీసురవరులును బ్రశంసించి’ రని విదురుండు గిమ్మీరువధ సెప్పిన విని ధార్తరాష్ట్రులకు హృదయదలనం బయ్యె; నిట పాండవులు గామ్యక వనంబున నుండు నంత. 121
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )