| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము |
| క. |
‘ఈ లోకమునకు మీఁదై | చాలఁగ వెలుఁగొందుచుండు స్వర్లోకము నా నాలంకారయుతము ది | వ్యాలోకము దేవయాన మది మునినాథా! |
129 |
| చ. |
అమలతపోనివాసులు మహాధ్వరశీలురు సత్యసంధు లు త్తములు జితేంద్రియుల్ సములు దానపరుల్ రణశూరు లందు హ ర్షమున వసింతు; రచ్చరలు సాధ్యులు దేవమునుల్ మరుద్వసు ప్రముఖులు వేఱువేఱ తగుపట్టుల నుండుదు రంద యిమ్ములన్. |
130 |
| వ. | మఱియు ముప్పదిమూఁడు వేల యోజనంబుల విస్తృతంబైన మేరుశిఖరంబునందు నందనప్రముఖంబు లైన దేవోద్యానంబులు పుణ్యపరులకుం గ్రీడాస్థానంబులై విలసిల్లు; నయ్యెడల నాఁకలియు నీరువట్టును శీతోష్ణభయంబులును జరారోగవికృతులును బుట్ట; వెయ్యెడలం జూచిన నతిమనోహరంబై సకలేంద్రియ తర్పణం బై యుండు; నిట్టి పుణ్యలోకంబునకు నర్హు లైన పుణ్యపురుషులు విధినియోగ పక్వంబు లయిన మానుషశరీరంబులు విడిచి తేజోమయంబు లగు దివ్యదేహంబులు ధరియించి వివిధాంబరాభరణ భూషితులును నమ్లానకుసుమమాలికా మనోహరులునై కనకవిమానంబులందు దేవదూతలచేతం గొనిపోవంబడి యందు శోకభ్రమశ్రమాయాసవిరహితు లై వివిధసుఖంబు లనుభవించుచుండుదురు. | 131 |
| ఆ. |
అనఘ! యింద్రలోకమునకంటె మీఁద ని | శ్శోక మగుచు బ్రహ్మలోక మమరు; నది యనన్యదీప్తసదన మై తన దైన | వెలుఁగునను జగంబు వెలుఁగఁ జేయు. |
132 |
| చ. |
మనువులు ధాతలున్ మునులు మానుగ నుండుదు; రందు లోభముం గినుకయుఁ గిల్బిషంబు నపకీర్తియు దుఃఖము జన్మవైకృతం బును జనియింప; వీభువనముల్ దెగునప్పుడు నాశమొంద ద వ్వినుతపదంబు; దానియెడ వేడుక సేయుదు రింద్రముఖ్యులున్. |
133 |
| వ. | స్వర్గంబునం గల గుణంబు లెఱింగించితిఁ దదీయదోషంబులు సెప్పెద వినుము. | 134 |
| తే. |
ఇందుఁ జేసినపుణ్యంబు లెల్ల నందుఁ | గుడుచుఁ గాని మర్త్యున కందుఁ గడఁగి పుణ్య మాచరింపంగఁ గాదు; పుణ్యావసాన | మగుడు భూమిక త్రోతురు మగుడ నతని. |
135 |
| క. |
కడు మరగిన సౌఖ్యంబులు | విడుచుటఁ జిత్తంబు దుఃఖవివశముగ మహిం బడుఁ జూవె; పుణ్యలోకం | బెడలిన మనుజుండు దేజ మేది యబలుఁ డై. |
136 |
| క. |
తన తక్కువయునికియు న | న్యుని యున్నతశీలతయుఁ గనుంగొని చిత్తం బున నెరియుచునికి గలుగును | జననుత! సురలోకవాస జనులకు నెల్లన్. |
137 |
| వ. | బ్రహ్మలోకంబునం దక్కఁదక్కిన పుణ్యలోకంబులం దెల్ల నిదియ మేరయై చెల్లు; మఱియుఁబుణ్యలోకపరిభ్రష్టుండ మర్త్యలోకంబున సుఖశీలుం డయి పుట్టు; నీలోకంబు గర్మభూమియు నాలోకంబు ఫలభూమియు నని యెఱుంగుము; నీవలని యాదరంబునంజేసి యింతయుం జెప్పితి; నీ వింకఁ దడయ నేల? చనుదె’ మ్మనిన ముద్గలుండు గొండొక విచారించి దేవదూతం జూచి యిట్లనియె. | 138 |
| ఆ. |
‘ఇట్టి దివ్యసుఖము లే నొల్లఁ; బదివేలు | వచ్చె నాకు; నమరవర్గమునక యుండనిమ్ము వాని నో యన్న! విచ్చేయు | మిష్టమైన యెడకు నిపుడ నీవు. |
139 |
| క. |
ఎయ్యెడకుఁ జనినఁ బురుషుం | డియ్యెదకును మగుడకుండు నెక్కాలము నే నయ్యుత్తమపదవికినై | యెయ్యనువున నైన నుత్సహించెద బుద్ధిన్.’ |
140 |
| వ. | అని దేవదూత వీడ్కొలిపి ముద్గలుండు శిలోంఛవృత్తి విడిచి, పరమశాంతిం గైకొని, నిర్వికల్పం బైన జ్ఞానయోగంబునం జేసి తుల్యనిందాస్తుతియును సమలోష్టాశ్మకాంచనుండును నై పరమసిద్ధిం బొందెఁ; బాండవోత్తమా! నీవును రాజ్యరహితుండనైతి నని వగవక తపంబు సేయుము; తపంబునంజేసి శుభంబులు సేకుఱుఁ; బదుమూఁడవునేఁటి కడపటఁ బితృపైతామహంబైన రాజ్యంబు నిన్నుం బ్రాపించు’ నని యిట్లు సాత్యవతేయుండు గౌంతేయుల నాశ్వాసించి నిజాశ్రమంబునకుం జనియె; నంత. | 141 |
| మ. |
వితతానేకమృగాకులంబును సదావిర్భూత నానాతరు ప్రతతీపుష్పసుగంధబంధురశుభావాసంబు బ్రహ్మర్షిసం శ్రితపుణ్యాశ్రమమండలంబు నగుచుం జెల్వొందు నక్కానలో ధృతపుణ్యుల్ విహరించి రేవురును గుంతీపుత్త్రు లిచ్ఛాగతిన్. |
142 |
| వ. | ఒక్కనాఁడమ్మహారథులు దృణబిందు నాశ్రమంబున ధౌమ్యసహితంబుగాఁబాంచాలి నునిచి యేవురు నొక్కట మృగయార్థంబు నలుదిక్కులకుం జనిన యనంతరంబ. | 143 |