పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
రాష్ట్ర జనుల కర్హధర్మములు భీష్ముఁడు ధర్మజునకుఁ దెలుపుట (సం. 12-67-2)
సీ. రాజు నుత్తమగుణ భ్రాజిష్ణు నభిషిక్తుఁ | గావించుకొని, యెల్ల కార్యములును
దన్ముఖంబునఁ జెల్లఁ; దద్దయు సుఖముండఁ | బడయుదు; రొకఁడు భూపాలనంబు
సేఁతలేకున్న దుశ్చేష్టితు లై జను | లన్యోన్య దారధనాపహరణ
మాచరింతురు; మీల యట్టుల బలవంతు | లల్పులఁ దమకు నాహారములుగఁ
 
తే. గొండ్రు; భూపతిలేకున్న మండ్రె జనము? | లధిప! కృషి సేయుటయును బేహార మాడు
టయును గోరక్ష గావించుటయును మొదలు | గాఁగఁ బ్రదికెడు తెరువులు గాసిగావె!
255
వ. వినుము. 256
సీ. జను లొక్కతఱిఁ దొల్లి సమయంబుఁ దమలోనఁ | జేసి క్రూరతయు మ్రుచ్చిమియు ఱంకు
సైఁపక యట్టి దుర్జను నందఱును గూడి | శాసించువారుగాఁ జాలి తమకు
నధిపతియుఁగ నొరునాసపడక యుండి | నడవడి బహుకారణములఁ జిక్కు
వడిన, విషణ్ణులై బ్రహ్మఁగానఁగఁ బోయి | మాకు రక్షకుఁడుగ మహిపుఁ డొకఁడు
 
తే. వలయు రూపింపు; మాతని గొలిచి బ్రదుకు | వార మనుటయు, నజుఁడును వారి వలని
కరుణ మనువు నిరూపించె; నరు లసత్య | చరితు లని పాలనమునకుఁ జొరఁడ యతఁడు.
257
వ. చొరకున్న నజ్జనంబు లమ్మహాత్మునితో ‘నీకుం బుయిలోడ నేల? ప్రజలచేతఁ బశువులయందును బసిండిని నేఁ బది యగు నంశంబును, ధాన్యంబున దశమ భాగంబును భండారంబుగాఁ బుచ్చికొని శస్త్రోపజీవుల నెల్ల నీ వారిం జేసికొని బలవంతుండవై దుష్టనిగ్రహ శిష్ట ప్రతిపాలనం బాచరింపు; మే మందఱము ని న్ననుసరించి నీ పనుపు చేయంగల వార; మధర్మ వర్తనులు నీ చేతం జెడువారు; ధర్మవర్తనులు చేసిన ధర్మంబున నాఱవపాలు నిన్నుం జేరంగలయదిగా నొడంబడితి; మింద్రుండు దేవతల రక్షించు మాడ్కి’ మమ్ము రక్షించుకొని సుఖంబుండు మనుటయు. 258
క. అతఁ డొడఁబడి యత్తెఱఁగున | నతిబలవంతుఁ డయి నీతి నంచిత మగు ను
ద్ధత విక్రమమునఁ దగ నీ | క్షితిఁ బాలించె; సుఖులై రశేష జనములున్‌.
259
ఉ. కావున మేలు సేయదె జగజ్జనకోటికి రాజునాజ్ఞమైఁ
బోవుట; యాతనిం దగిన పూజలఁ దృప్తునిఁజేఁత; దేవసం
భావనఁ గొల్వ తండొకటఁబాడి తొఱంగిన సైఁచు టిట్లు సం
భావితుఁ జేయఁగా నతని పంపొనరింతురు మ్రొక్కి శత్రులున్‌.
260
క. తనవారు పెద్ద సేయని | మనుజేశు నరాతిజనులు మదిని సరకుగాఁ
గొన; రది భూప్రజ కొప్పదు | విను! కావునఁ బతికిఁ బ్రజలు వెఱచుట యొప్పున్‌.
261
తే. వాహనాసన శయ్యా నివాసములును, | భోజ్య గంధ మాల్యాంబర భూషణములు,
గుప్తియును నరపతికి నెక్కుడుగ వలయు | నను తలంపునఁ బ్రజలకు మనుట గుణము.
262
చ. అతఁడును మందహాస సహితాలపనంబును, సత్యభాషణ
వ్రతమును, సంవిభాగ నిరవద్యతయున్‌, సమభావముం, గృత
జ్ఞతయు, జితేంద్రియత్వముఁ, బ్రసాద గుణంబును గల్గి భూమికిం
బితృసముఁడై విరోధి జన భీషణ సారత నొప్పఁ బెం పగున్‌.’
263
వ. అనుటయుం గౌంతేయాగ్రజుండు ‘మనుష్యుల కెల్ల రా జధిపతియును దైవంబునుంగా విప్రులు చెప్పి; రట్లగుట యేమిటనో? యని యుండుదు;నది మీవలనం బ్రస్ఫుటంబుగా వింటి’ నని పలికిన; గాంగేయుఁ ‘డింకనుం జెప్పెదఁ దొల్లి వసుమనుం డను మానవేంద్రుండు నీవ పోలె వితర్కించి బృహస్పతి నడిగిన, నతం డతనికిఁ జెప్పిన భంగి యాకర్ణింపు’ మని యిట్లనియె. 264
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )