పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
స్థూలకర్ణునకుఁ గుబేరుని వలన స్త్రీత్వము గలుగుట (సం. 5-193-39)
వ. స్థూలకర్ణుండును దలరి దండప్రణామంబులు సేసియుండె; నప్పుడు గొలిచియున్న దొరలు ధనదునకుం గృప వుట్ట నల్లన తెలిపిన నట్లేని ‘వీడు శిఖండి యాయువు గలంతకాలంబున గాంతాకృతియై యుండి, పదంపడి నిజరూపంబు దాల్చుంగాక!’ యని యనుగ్రహించి యరిగిన. 395
తే. గుహ్యకుండు విషాదంబు గూరియుండ | నచ్చటికిఁ గొన్ని దినముల కరుగుదెంచెఁ
దల్లిదండ్రుల కెఱిఁగించి తగవు మెఱయ | సమయనిష్ఠ వాటించి పాంచాలసుతుఁడు.
396
క. వచ్చినఁ గనుఁగొని ‘నీ దెసఁ | బొచ్చెము లే; దిట్ల మగిడి పొ;మ్మిది విధి నీ
కిచ్చిన రూ’పని గుహ్యకుఁ | డచ్చుపడం బలికి యెల్ల నతనికిఁ జెప్పెన్‌.
397
వ. చెప్పి వీడుకొలిపిన శిఖండి యత్యంత ప్రమోదంబునం దండ్రి కడకు వచ్చి యత్తెఱం గెఱింగించిన నాతండు ప్రీతుండయి దేవగురుద్విజపూజనంబు లాచరించి ద్రోణాచార్యుపాల సవిశేషంబుగా శిష్యభావంబు ప్రతిష్ఠించె’. 398
క. అని చెప్పి నారదుఁడు దా | నును సత్యవతీ సుతుండునుం దమ యిచ్చం
జనిరి; శిఖండి చరిత్రము | జనకర్ణ పరంపరం బ్రశస్తం బయ్యెన్‌.
399
వ. ఇవ్విధంబునఁ గాశీపతికన్యక సిద్ధమూర్తి యయి నెగడె; నేను నంగనల నంగనాపూర్వుల నంగనాభిధానుల నంగనాకారులను వధియింపకుండ వ్రతంబు పూనినవాఁడం గావున నంగనాపూర్వుండగు శిఖండి నాకు భండనంబునం గోదండపాండిత్యంబు మెఱసినను జంపను నొంపనుఁ; గడంగితిన యేని నింతకంటె దుర్యశంబు గలదె? యెట్లయిన నగుదుంగాని భగ్నవ్రతుండ నగుట కోర్వ నిది నా తెఱంగు.’ 400
క. అని చెప్పిన దేవవ్రతు | వినుత వచనములు విభుండు విని తన చిత్తం
బున నొక్కింత వగచి’ యీ | తనికి మగతనంబు పూన్కి తగు’నని పలికెన్‌.
401
వ. తదనంతరంబ కొలువునం గలయ సమర విషయంబు లయిన సల్లాపంబులు సెలుచుండఁ గొండొకసేపు వినుచుండి సుయోధనుండు సురనదీసూనున కిట్లనియె: 402
ఆ. ‘పాండవులకుఁ గలుగు బలము లన్నియు సమ | యింప నీకు దినము లెన్నివట్టు
గురుఁడుఁ గృపుఁడు గురుని కొడుకుఁ గర్ణుండు నెం | తెంత మానమున వధింతు రనఘ?’
403
వ. అనిన విని గాంగేయుం డతని కిట్లనియె : 404
క. ‘అనిఁ బాండవ సేనలఁ జం | పను జెఱుపను నేము చాలు భంగుల నీ కి
ట్లనుమానము వాయఁగ నడు | గన తగుఁ; గడు లెస్స! విందు గాక నరేంద్రా!
405
వ. ఏను నా సాలెడు కొలంది సెప్పెదఁ; దక్కటివారుఁ దమ తమ చాలుటలు దార చెప్పెద; రది యెల్లను బిదప విందుగాని; మున్ను నీ కొక్క బాస యిచ్చెద నాకర్ణింపుము. 406
క. మీఁటుగల రాజరథికుల | నాఁటికి వేవుర వధింతు; నరుశరములు నో
నాఁటి పడవైచునంతకు | వేఁటాడెదఁ బ్రతిబలంబు వీరుల నెల్లన్‌.
407
వ. అట్లుగాక నా కయ్యంబు సేయు దివసంబులోన. 408
క. పదివేలఁ జంపఁగా నో | పుదు నే నను నెత్తికోలు పుట్టిన యది నీ
పదునొకఁ డక్షౌహిణులను | జదురున నడపింతు నెదిరి సైన్యము గలఁతున్‌.’
409
వ. అని పలికి వెండియు. 410
క. ‘నీ వడిగిన పని యేర్పడఁ | గా విను “మేనొక్క నెలఁ’ దెగంజేయుదు నా
నావిధ దివ్యాస్త్రంబుల | లావున నప్పాండవుల బలంబుల నెల్లన్‌.’
411
వ. అనవుడు గురుకృపాశ్వత్థామ కర్ణులం గలయం గనుంగొని గాంధారీనందనుండు ‘మీమీ చందంబులెట్ల? నిన నాచార్యుండు మందస్మితాననుం డగుచు నిట్లనియె. 412
తే. ‘ఏను ముదిసిన వాఁడ మహీశ! యెట్టు | లయిన నోపిన భంగి నీ యనుఁగుఁ దాత
సాలి నన్నిదినంబులఁ జాలవచ్చు | నబ్బలంబుల నని సమయంగఁ జేయ.’
413
క. అనినఁ గృపాచార్యుం ‘డీ | యినుమడి దివసములఁ దీర్ప నేనోపుదు’ నా
విని గురుతనూభవుఁడు ‘పది | దినములఁ గడతేర్తు’ ననియె ధీరవిచారా!
414
వ. అందఱ పలుకు లాకర్ణించి కర్ణుండు. 415
క. ‘నానాస్త్ర శస్త్ర చయ బల | బానలముం గవియఁ జేసి యత్యుగ్రత నే
నేనాళ్లన యప్పాండవ | సేనా సాగరము నివురఁ జేయుదు నధిపా!”
416
వ. అని ప్రతిన సేసినఁ గలకల నవ్వి గాంగేయుండు. 417
చ. ‘పలికిన నేమి యన్నియును బల్క నగున్‌ మనరాజు నొద్ద మా
ర్పలికెడు వారు లేరు విను పాండవమధ్యము గాండివంబు దీ
ప్తుల మిఱుమిట్లుఁ గొన్న కనుదోయి గుణధ్వని వ్రయ్యలైన వీ
నులు నయినన్‌ బలే పలుకు నూల్కొనకుండుదు సూతనందనా!
418
వ. అనియె; నివ్విధంబున నీ కొడుకు కడం బుట్టిన విశేషంబులు ధర్మతనయుండు చారులవలన విని తమ్ముల రాఁబనిచి వారలతో నిట్లనియె. 419
సీ. ‘మన చారు లిప్పుడు చనుదెంచి రావీట | నుండి; దుర్బుద్ధి సుయోధనుండు
గొలువున గాంగేయ కుంభసంభవ కృపా | శ్వత్థామ కర్ణుల వలను చూచి
యనిఁ బాండవుల బల మంతయు సమయింపఁ | జాలుదు రెంతేసి కాలమాన
మున? నన్న భీష్ముండు దన కొక్క నెలవట్టు | ననియాడె; ద్రోణుండు నట్ల పలికెఁ;
 
ఆ. గృపుఁడు రెట్టి సెప్పెఁ; గృపి కొడు కోపుదుఁ | బది దినముల ననియె బాహువీర్య
ఘనుఁడు గాన సూతతనయుఁ డేనాళ్లన | తీర్ప నేర్తు నని ప్రతిజ్ఞ చేసె.’
420
వ. అని చెప్పి యర్జునుం గనుంగొని ‘వారు తమ తమ యోపిన చందంబులు సెప్పిరి; నీచేతం గౌరవ బలంబు లెంత దడవునకుం దెగు? నాకుం జెప్పు’ మనిన నతం డిట్లనియె. 421
తే. ‘వార లంతకుఁ జాలని వారె? నీ బ | లముల సమయింపఁ జాలెడు లావు వెరవుఁ
గలర కాక! యా రాజుతోఁ బలికి బాస | దప్పవచ్చునె వారికి ధరణినాథ!’
422
వ. అని దరహాసోల్లాస భాసిత వదనుండై. 423
మ. ‘అనుమానం బదియేల? నీమది మదీయ స్ఫార బాహాబలం
బు నిరూపింప దలంచి తేని విను; మేపుం జేవయుం జూపి కృ
ష్ణుని తోడ్పాటునఁ బేర్చి యేఁ గడగినం జూర్ణంబు గావింతు నొ
క్కనిమేషంబున దేవదానవులతోఁ గూడం ద్రిలోకంబునున్‌.
424
వ. అది యెట్లంటే నిఁ గృత్రిమ కిరాతుండైన పశుపతి మెచ్చి జగత్సంహార సమయంబునం దాను బ్రయోగించునట్టి పాశుపత మహాస్త్రంబు నాకిచ్చె; నది నాయందు సన్నిహితంబయి యున్నయది గావున శత్రునిరాసం బనా యాసంబై యుండు; నప్పాశుపత మహనీయ ప్రభావంబు భీష్ముండున్నరూపెఱుంగఁడు, ద్రోణ కృపాశ్వత్థామలు నెఱుంగరు, కర్ణున కెఱుంగ నెంతదవ్వట్టి ఘోర సాధనంబున సమస్తంబును సమయించుట యుక్తంబు గాదు తక్కిన యాయుధంబులం బోరి వైరులం బరిమార్చినం బౌరుషంబు దీపించు నని తలంచెద; నప్పటికి వలయు విధం బయ్యెడు; నది యట్లుండె; నీవా రక్కడి వారికిం దక్కువవారే? భీమసేనుండు కవ లభిమన్యుండు ద్రౌపదేయులు సాత్యకి విరాట ద్రుపదులు ధృష్టద్యుమ్నుండు శిఖండి యుత్తమౌజుండు యుధామన్యుండు ఘటోత్కచుండు మొదలైన జగజెట్లున్నవారు; మఱియు ననేకులు వీరల యట్టివారలు కలరు; వారల నందఱం జెప్పనేల? యేనుంగువోలె నీలావు నీవెఱుంగవు దివిజులకు నజేయుండవు నీయొక్కనికిఁ ద్రిభువనంబు నెదురె నీవు నిక్కం బలుగవుగాక; నీ వలిగిన నెవ్వ రెట్లయ్యెదరో యటు సూడుము; నీ సైన్యంబుల నెవ్వరికి నేమి చేయవచ్చు మనకు విజయానందంబు సులభంబ’ యని పలికె నని సంజయుండు ధృతరాష్ట్రున కెఱింగించె’ నని వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పుటయు. 425
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )