ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రముచే వానరసైన్యమును హతమార్చుట
క. పరవీరులపై వైశ్వా
నరుచేఁ గొన్నట్టి చాపనారాచములుం
బరిఘయు బ్రహ్మాస్త్రముఁ గొని
దుర మొనరింపంగ వచ్చె దోర్బలశక్తిన్‌.
54
వ. తదనంతరంబున. 55
క. తండోపతండములుగాఁ
జండాశుగసమితిఁ బఱపి శైలశరాళిన్‌
గాండమయంబుగఁ జేయుచు
భండన మొనరించె దైత్యపతిపుత్త్రుండున్‌.
56
సీ. మిన్నక రామసౌమిత్త్రులమీఁదను-బ్లవగసేనలమీఁద బాహుశక్తి
బ్రహ్మాస్త్ర మడరింపఁ బటునినాదంబునఁ-బఱతెంచి వానరప్రతతిమీఁద
బ్రహ్మమంత్రజ్ఞానపరు లైనవారి ని-ర్భంధంబుగాఁ జుట్టి పట్టి కట్టి
తక్కినవారల నుక్కడగించినఁ-గనుఁగొని యమరేంద్రకంటకుండు
 
తే. వైరమెల్లను నేఁటితోఁ దీఱె ననుచు-మించి కెరలుచు విల్లెక్కు డించి పొదలి
శాంతతను బొంది రాక్షసచక్రవర్తి-కడకు నేఁగెను వడి ముద్దుఁ గొడుకుఁగుఱ్ఱ.
57
క. మునినాయక విను మంతట
దనమనుమలపాటు దెలిసి తనలోఁ దానే
కనుఁగొనఁ జాలక పోయెనొ
యనఁగను నపరాబ్దిలోన నర్కుఁడు గ్రుంకెన్‌.
58
క. అరవిందభవుని కరుణను
వర మందినవాయుసుతుఁడు వసుమతిమీఁదన్‌
మఱి బ్రహ్మమంత్రజపముం
బిరుదై యున్నట్టి యలవిభీషణుఁ డొకఁడున్‌.
59
వ. తక్కఁ దక్కినవా రెల్లను మూర్ఛాగతులై చచ్చినయట్లు పడి
యున్న సమయంబున వాయుసుతుండు విభీషణుండును దమలో నెవ్వరు సచ్చిరో
నొచ్చినవారెవ్వరో విచారింపఁదగు నని మహోగ్రాంధకారంబునడుమ నింగలపుఁ
గొఱవులు పట్టుకొని రణరంగంబుఁ గలయ శోధింపుచువచ్చి శరతల్పంబున
నున్న జాంబవంతునిం గని విభీషణుం డిట్లనియె.
60
క. భల్లూకేశ్వర! వానరు
లెల్లను నృపవరులతోడ నిలమీఁదను మూ
ర్ఛిల్లియుఁ జచ్చియు నున్నా
రొల్లంబోవుచును దీని కుపమ యె టన్ననన్‌.
61
ఆ. అపుడు జాంబవంతుఁ డసురేశ నీవంకఁ
గన్ను విచ్చి చూడఁ గానరాదు
వాయుసుతుని మేలువార్త నాకిప్పుడు
చెవులు సోఁకునటు చెప్పుమయ్య.
62
వ. అనిన విని హనుమంతుండు. 63
చ. పదములఁ జేరి మ్రొక్కుచును బాణియుగంబును మోడ్చి నీ కృపన్‌
బ్రదికినవాఁడ నన్న నతిప్రీతినిఁ జేరఁగ దీసి నీవిటన్‌
బ్రదికితిగాన నీకతనఁ బార్థివముఖ్యునిసేన లన్నియున్‌
బ్రదుకునిజంబుగా నిపుడుపావనియంచుఁ బ్రియంబు సేయుచున్‌.
64
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - prathamAshvAsamu ( telugu andhra )