| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | కౌసల్యా కైకేయీ సుమిత్రలు దివంబున కరుగుట |
| తే.గీ. | ఏకతంబున నున్నచో నినకులుండు భామినీమణి నూహించి పరితపించుఁ గొలువులో నున్నయప్పుడు కొడుకులఁ గని సీతరూపంబు భావించి చింత నొందు | 145 |
| సీ. | రాజ్యంబుఁ జేయు శ్రీరాముని విభవంబు - కన్నులు చల్లగాఁ గాంచి యలరి యమితదక్షిణలతో నాతఁ డొనర్చిన - యాగకోటులు కని హర్షమొంది యవ్వ! యంచు సపర్య నాచరించు కుశాది - పౌత్త్రులఁ గనుఁగొని బాళిఁజెంది సీత వోయినచింతఁ జెందనీక భజించు - నూర్మిమళాదులఁ జూచి యూఱడిల్లి | |
| గీ. | యెల్ల బంధులఁ బోషించి యిహసుఖంబు లెల్లఁగని యెల్ల సవతుల యుల్ల మలర నడిచి సడిసన్న కౌసల్యనాథుఁ డున్న లోకమున కేఁగె సుతులెల్ల శోకమొంద. | 146 |
| వ. | అప్పుడు | 147 |
| కం. | తల్లీ! సాధ్వీలోకమ తల్లీ! మముఁబాసి పోవఁదగునే యనుచున్ దల్లడమందుచు రఘుపతి తల్లికిఁ బరలోక విధులు తగ నొనరించెన్ | 148 |
| చం. | పతికడ కామె చన్న యొక పక్షములోపల నేఁగెఁ గేకయ క్షితిపతి పుత్త్రియున్ విభుని చెల్మికి నంతటిలోఁ గ్రమంబునన్ గతిపయవాసరంబులకుఁ గాంతునిఁ జేరె సుమిత్రయున్ నయ వ్రత లయినన్ సపత్నులు పరస్పరసౌఖ్యము లోర్వ రెయ్యెడన్ | 149 |
| కం. | ఆ మాతల గూర్చి రఘు గ్రామణి మహిసురుల కొసఁగె రత్నాభరణ స్తోమంబులు హేమంబులు గ్రామంబులుఁ బారలౌకికక్రియలయెడన్ | 150 |
| చం. | అతులవిభూతి మీఱఁ బితృయజ్ఞము లిట్టు లొనర్చి రామభూ పతి యశుచిత్వమున్ దొరఁగి బంధుపురోహిత మంత్రి సోదరా న్వితుఁడయి యొక్కనాఁడు మహనీయసభన్ గొలువున్నఁ గేకయ క్షితివరు దూత వచ్చి నుతిఁజేసి కరంబులు మోడ్చి యిట్లనెన్ | 151 |
| ఆ.వె. | స్వామివారికడకు మీమామ తమపురో హితునిఁ బంపె నాతఁ డిదిగొ వచ్చు చున్నవాఁడు నేను మున్నుగాఁ దెలుప వ చ్చితి నటన్న నృపతిశేఖరుండు | 152 |