| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శత్రుఘ్నుఁడు తనకుమారులకుఁ బట్టముఁ గట్టి రామునికడకు వచ్చుట |
| తే.గీ. | అంతశత్రుఘ్నుఁ దోడి తెమ్మని నృపాలుఁ డాప్తుఁ డగుదూత నొక్కని ననుప వేగి రమునఁ జని వాఁడు మూఁడహోరాత్రములకు నధిక సౌభాగ్యమధురయౌ మధురఁ జేరి | 242 |
| మ. | అలశత్రుఘ్నునిఁ గాంచి లక్ష్మణుని నిర్యాణంబు పౌరాశ్రితా దులు దామున్ బతిఁ గొల్చి పోవుటకు నుద్యోగించు టాత్మీయపు త్త్రులకున్ గోసలభూము లిచ్చి జననాథుం డూర్ధ్వలోకోన్ముఖా కలితప్రజ్ఞ వహించి యున్కి మొద లౌ కార్యస్థితుల్ దెల్పినన్ | 243 |
| కం. | విని కలఁగియుఁ గలఁగక య జ్జననాథసుతుండు ధైర్యసంపన్నతఁ గాం చనుఁ డనుపురోహితునిఁ బుర జనములఁ బిలిపించి ప్రియమెసఁగ నిట్లనియెన్ | 244 |
| తే.గీ. | అన్న నెడఁబాసి లక్ష్మణుం డమరపురికి నేఁగెనఁట యెల్ల ప్రజలతో నింక విభుఁడు వెడల నున్నాఁడఁట యయోధ్య విజనమయ్యె నఁట విలోకించితిరె కాల మెటుల వచ్చె! | 245 |
| ఉ. | రామవిభుండు లేనియమరావతినైన క్షణంబు నిల్తునే యీమధురాపురంబునకు నింక సుబాహు మదగ్రపుత్త్రునిన్ స్వామిగఁ జేసి యుంచి విదిశాపురరాజ్యము శత్రుఘాతికిన్ బ్రేమ నొసంగి పోయెదను మీర లనుజ్ఞ యొసంగుఁ డియ్యెడన్ | 246 |
| కం. | అని పలికి వారియనుమతిఁ గొని యాయాపురములకును గొడుకుల నభిషే చన మొనరించి చెఱిసగముగ ఘనబలములఁ బంచి యొసఁగి గమనోన్ముఖుఁడై | 247 |
| కం. | సుతదారాదుల వీడ్కొని యతఁ డతిధైర్యమున నొంటియరదముతో క్ష్మా పతి సంప్రేషితదూతా న్వితుఁ డయి సాకేతమునకు నేతెంచి వెసన్ | 248 |
| శా. | నందర్శించె మహాసభాంతరమునన్ శత్రుఘ్నుఁడుద్యత్సదా నందున్ భూరికుశాసనస్థితు మునీన్ద్రశ్రేణిసంభావితున్ సందీప్తానలతేజు శాంతినిరతున్ క్షౌమాంబరోద్ధారు స్వ చ్ఛందున్ జంద్రనిభాననున్ ఘనసదృక్షశ్యామునిన్ రామునిన్ | 249 |
| కం. | సందర్శించి ప్రియంబున వందనమొనరించి స్వామివారియనుజ్ఞన్ నందనులఁ దగినభూముల యందుఁ నిలిపి వచ్చినాఁడ నకలంక మతిన్ | 250 |
| చం. | పలుకులు వేయునేల మిముఁ బాసి యిఁకన్ క్షణమైన నిట్టి భూ స్థలమున నిల్వఁ జాల నిది సత్యము నేనును గొల్చి వచ్చెదన్ వలదని యానతీయకుఁడు త్వాదృశు లెయ్యెడ నమ్మియున్నవా రల విడరంచు వేఁడుకొన రమ్మనె నాతని రాముఁ డాదృతిన్ | 251 |
| వ. | తత్కాలంబున | 252 |
| చం. | నరపతి యూర్ధ్వలోకగమనంబు చరుల్ వినిపింప ఋక్షవా నరులు నిశాచరుల్ విని స్వనాథులఁ గూడి యయోధ్య కేఁగుదెం చిరి వినయంబు మించ రఘు శేఖరుఁ గాంచి ప్రణామముల్ ఘటిం చిరి కరముల్ మొగిడ్చిరి వచించిరి యిట్లని యందఱొక్కటన్ | 253 |
| కం. | ధరణీనాయక! మే మిం దఱమున్ మిముఁ గొల్చి వచ్చుతలఁపున నిటకున్ బఱతెంచితి మెడపక మము గురుకృప నిఁక వెంటఁబెట్టుకొని పోవఁదగున్ | 254 |
| చం. | అనునెడ భానుసూతి వినయంబున రామునిఁ జేరి మ్రొక్కి యో మనుకులనాథ దేవవిభుమన్మని వానర రాజ్యపట్టభ ద్రునిఁగ నొనర్చి మీచరణతోయరుహంబులు గొల్వ వచ్చితిన్ నను విడనాడి పోవకుఁ డనన్ బతి సమ్మత మొందె నెమ్మదిన్ | 255 |
| కం. | ఫాలన్యస్తాంజలి యై యాలోన విభీషణుండు నండకు రాఁగా నాలోకించి రఘూద్వహుఁ డేలా యీతలఁపు రాక్షసేశ్వర! నీకున్ | 256 |
| చం. | ధరణి చరాచరావళులు దాలిచి యుండెడు నంతకాలమున్ పరమవినీతి లంక పరిపాలనసేయు మి దేల యంచు ను త్తరములు పల్క రాకుము సదా చరియింపుము ధర్మపద్ధతిన్ నిరతిశయప్రభావమున నెయ్యము మర్వకు మంచుఁ బల్కినన్ | 257 |
| కం. | రామాజ్ఞకు వెఱచి యతం డేమియు నన నేరకుండె నినకులుఁ డంతన్ సామీరి మోముఁ జూచి సు ధామధురవచో నిరూఢి తగ నిట్లనియెన్ | 258 |
| శా. | ఏతన్మాత్రుఁడవే విభాకరకృపావీక్షా సమాసాదిత శ్రౌతస్మార్తరహస్య రాశివి భవిష్యద్ధాత వధ్యాత్మవి ద్యాతాత్పర్యనిరూఢ బుద్ధివి విశుద్ధబ్రహ్మచర్యవ్రతో ద్ధూతాంభశ్చరకేతనుండ వఖిల స్తుత్యప్రభావోదయా! | 259 |
| కం. | మత్కీర్తిచంద్రికలు యా వత్కాలము కువలయమున వన్నియఁ గనుఁ దా వత్కాలముఁ గపిచంద్ర భ వత్కాయం బమృతగతి ధ్రువంబుగ నిల్చున్ | 260 |
| కం. | నామాటలు నిక్కువ మగుఁ నీమదికోర్కియు ఫలించు నిత్యుఁడ వగు మిం కేమియు బలుకకు మని రఘు రాముఁడు సామీరినని కరం బనురక్తిన్ | 261 |
| తే.గీ. | బ్రహ్మసుతు ఋక్షకులసార్వభౌముఁ జూచి నీవు చిరకాలజీవివి నిర్మలుఁడవు కలఁగ కెప్పటివలె భూమి నిలువు మని వ చించి మైందద్వివిధువీక్షించి విభుఁడు | 262 |
| చం. | బలువగువేడ్క మీ రమృతపానముఁ జేసినవారు గావునన్ తలుగదు మీకు హాని చిరకాలము వర్తిలుఁ డుర్వి నంచుఁ బెం పలరఁగఁ బల్కి తక్కిన వనాటుల నాబడి నేఁగుదెండు చిం తిలక తలంచి నట్లయని తేటపడన్ వివరించె నయ్యెడన్ | 263 |
| కం. | ఆరఘురాముని మాటలఁ బౌరులు బాంధవులుఁ గపులు బహుజానపదుల్ గోరికఁ బెండ్లికిఁ బోయెడు వారి వలెన్ జెలఁగి రుత్సవంబులు వెలయన్ | 264 |
| సీ. | చూడవచ్చిన మహీసురులకుఁ దమయిండ్లు - వేడ్కతోఁ జూఱలు విడుచువారు దిక్కులనుండి యేతెంచిన యర్థుల - కెల్ల పదార్థంబు లిచ్చువారు ధరణి దాఁపుటయును ధర్మమంచు ధనంబు - చెలఁగి నిక్షేపముల్ సేయువారు కళ్యాణ మిఁక నింతకంటె నెట్టిదియని - సకలోత్సవంబులు సలుపువార | |
| తే.గీ. | బంధములు దీటె మనతపఃఫలము లొదవె నెప్పు డిఁక వేగుఁ బతివెంట నెపుడు వోదు మంచు నలరేయి యుగముగా నెంచువారు నైరి సాకేతముననున్న యఖిల జనులు | 265 |
| మ. | మఱునాఁ డంత వసిష్ఠుఁ జూచి రఘురామస్వామి వల్కెన్ మునీ శ్వర! నేఁడే పరమేష్ఠి వీడుఁ దిలకింపన్ వేడ్క వాటిల్లెడిన్ పరిపాటిన్ నెరవేర్పుఁ డంచితమహాప్రస్థాన కర్మంబు ముం దర సాగింపుఁడు యాగవహ్ను లన నాతం డట్ల కావించినన్ | 266 |
| సీ. | పండు వెన్నెలడాలు బైటవేయగఁ జాలు - ప్రవిమల క్షౌమాంబరములు గట్టి గరుడపచ్చలయేపు పరిహసింపఁగ నోపు - దర్భాంకురములు హస్తములఁ దాల్చి హరినీలములరంగు నపహరింపఁ దొడంగు - ఘనకేశబంధంబు వెనుకఁ జేర్చి తమ్మిఱేకులజోక తలఁగఁ జేయువిలోక - నములు స్వనాసికాగ్రమున నుంచి | |
| గీ. | శాంతలక్ష్మి వసించుకంజాత మనఁగ మొగము దులకించఁ బటుమౌనముద్ర మించ నేవికారంబు లేక యయ్యినకులేంద్రుఁ డల్లనల్లన నాత్మగృహంబు వెడలె | 267 |