| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | షష్ఠస్కంధము |
| వ. | ఇట్లతిభయంకరంబైన తపంబు సేయుచు, నెడతెగక భగవన్మంత్రంబుల నొడువుచుఁ, బ్రజాసర్గ కాములై యున్న యచ్చిన్ని బాలుర కడకు నారదుండు సనుదెంచి, పూర్వవిధంబునం బలుకుచు నిట్లనియె; భ్రాతృవత్సలులై యున్న మీరలు వేదాంతసారంబు వలుకుచున్న నా వచనంబు లాదరించి తోఁబుట్టువులు సనిన మార్గంబునఁ జనుండు; ఎవ్వఁడేనియుఁ దన యగ్రజులు గన్న మార్గంబునం దానునుం దప్పక వర్తించు, నట్టివానిని విశేషధర్మం బెఱింగిన వాఁడండ్రు; సతతంబును బుణ్యబంధువులైన దేవతలంగూడి సుఖం బుండుండని పల్కి నారదుండు సనియె. వారలు సర్వకర్మంబులయందు నిర్మోహితులై పరమ పదంబునకు నాస్పదంబులైన దేవర్షివాక్యంబుల నాశ్రయించి. | 246 |
| ఉ. |
అప్పుడు లజ్జతోడ శబళాశ్వులు పూర్వజు లేగినట్టి యా చొప్పున నెన్నఁడుం దిరిగి చూడని త్రోవ విశేషపద్ధతిం దప్పక పోయిరయ్య! గుణధాములు, నేఁడును మళ్ళరేమి నేఁ జెప్పెదఁ గాక రాక కడఁజేరిన రాత్రులఁబోలి భూవరా. |
247 |
| క. |
దక్షున కా కాలంబున లక్షిత మై యుండెఁ బెక్కు లాగుల నుత్పా త క్షోభంబులు వానికి రూక్షవ్యథ నొంది యా పురుషనాశమునున్. |
248 |
| క. |
నారదకృత మని యెఱిఁగి మహా రోషముతోడ నేగి యాతనిఁ గని దుః ఖారూఢచిత్తుఁడై మది నూఱడిలం దెరువు లేక యుగ్రుం డగుచున్. |
249 |
| తే. |
మోము జేవుఱింప ముడివడ బొమదోయి చూపువెంట మంట సుడిగొనంగఁ బెదవు లదరఁ బండ్లు పెటపెటఁ గొఱుకుచు దక్షుఁ డాగ్రహించి తపసిఁ బలికె. |
250 |
| చ. |
నెరయఁగ సాధురూపమున నీ వతిబాలుర కాత్మజాళికిం గఱకున భిక్షుమార్గ మగు కందువ సెప్పితి వేల? ధూర్తవై మఱుఁగక యుండవచ్చునె? కుమారుల నీ దురితంబు వొంద, ని న్నొఱలఁగఁ ద్రోతు నాదు సమదోగ్రమహాగ్రహశాపవహ్నులన్. |
251 |