పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
పాండవులు ద్వైతవనంబునకు వచ్చి యుండుట (సం. 3-23-42)
వ. అని యిట్లు సాల్వుం దన చంపిన విధంబు సెప్పి, చక్రధరుండు పాండవుల వీడ్కొని, సుభద్రాభిమన్యులం గాంచనరథం బెక్కించుకొని తోడ్కొని ద్వారవతి కరిగె; ధృష్టద్యుమ్నుండును బ్రతివింధ్యాదులైన ద్రౌపదేయులం దోడ్కొని ద్రుపదుపురంబునకుం జనియె; నిట పాండవులును రథంబు లెక్కి యాయుధంబులు ధరియించి యింద్రసేనాది మూలభృత్యు లిరువదుండ్రు ముందట రా ననేక సహస్ర బ్రాహ్మణ వరులతో ద్వైతవనంబున కరిగి; రంత ధర్మరాజు తమ్ముల కిట్లనియె. 199
మధ్యాక్కర ‘ఇది మహోగ్రాటవి, సింహశరభోరగేంద్ర శార్దూల
మద గజాకీర్ణంబు, దీనిలోన నేమఱకుండ వలయు,
నదియునుంగాక పరప్రయోగమాయలు గల, వెఱిఁగి
మది నుండునది’ యన్న నన్న కిట్లను మఘవనందనుఁడు.
200
వ. ‘బ్రహ్మవిదులును దపోవృద్ధులైన బ్రాహ్మణులును నఖిలలోకద్వారంబులనపత్రిహతులైన నారదద్వైపాయనాది మునివరులును నీచేత నుపాసితులయి నీ కుశలంబ కోరుచుండుదురు; భవత్ప్రతాపం బెల్లవారిని రక్షించు నివ్వనంబు సకలకాలకుసుమ ఫలభరిత వనస్పతిశాఖాశిఖారూఢమయూరకీరకోకిలాలాప మధురంబును, బక బలాక కోక కారండవ సారస రమ్యమధుకర సౌమ్య సరోవర సంకులంబును, విమలశీతల జల ప్రవాహ నదీశోభితంబును, మహర్షి గణ సేవితంబునునై యొప్పుచున్నయది; యిందుండుదమని లలితలతావితానాది రమణీయంబులయిన వృక్షమూలంబుల నేవురు వేఱువేఱ నివాసంబులు సేసి నియతాత్ములయి యిష్టంబున దేవ పితృ కార్యంబులు సేయుచుందమ్ముఁజూడవచ్చిన మహామునులకు, బ్రాహ్మణులకు మనఃప్రియంబులయిన యాహారంబులు వెట్టుచు ద్వైతవనంబున నుండునంత. 201
క. పాండవులకడకు ధర్మ వి | దుండు తపోదహనదగ్ధదురితౌఘుఁడు మా
ర్కండేయుం డను మునినా | థుం డంతేవాసిగణముతోఁ జనుదెంచెన్‌.
202
వ. ఇట్లు వచ్చి వారలచేత నర్చితుండయి వనవాస క్లేశదుఃఖితులైన పాండవులను ద్రౌపదిం జూచి యమ్మార్కండేయుం డిట్లనియె. 203
సీ. ‘పితృనిదేశమ్మునఁ బృథివీశ్వరత్వంబు | విడిచి సానుజుఁడై పవిత్రచరిత
జానకిఁ దోడ్కొని చని వనంబున నున్న | రఘుకులనందను రాముఁ దొల్లి
చూచితి; నిపుడు భూసురవంశపోషకు | సాధుజనస్తుత్యు సత్యధర్మ
నిత్యు ధర్మజు రమణీయకీర్తిప్రియు | శమవంతుఁ జూచితి; సగర భరత
 
ఆ. నల యయాతి వైన్య నాభాగులాదిగా | నాదిరాజులెల్ల నధిక ధర్మ
సత్యయుక్తిఁ జేసి సకలలోకంబులు | వడసి భాగధేయభాగు లయిరి.
204
వ. పాపసౌబలప్రయుక్తుం డయిన ధార్తరాష్ట్రునట్లు ధర్మువు దప్పినవా రెవ్వరును లేరు; మీరు ధర్మనిత్యులగు సత్యవ్రతులరు గావున మీ కిష్టసిద్ధి యగు’ నని మార్కండేయుం డరిగిన, నపరసంధ్యోపాసనాసీనుం డయిన ధర్మరాజును సాయంహోమార్థప్రజ్వలిత జ్వలనంబు లయిన యనేక సహస్ర బ్రాహ్మణాగ్ని హోత్రంబులం జూచి బకదాల్భ్యుండను మహాముని యిట్లనియె. 205
ఉ. ‘భూమిసురోత్తముల్‌ ప్రకృతిపుణ్యవిధాయులు వీరు ఋగ్యజు
స్సామపరాయణుల్‌ పరమసాధుచరిత్రులు మీకు సంతత
ప్రేమమునన్‌ శుభోన్నతులు వెంచుచు నుండుటఁ జేసి సద్గుణో
ద్దామ! యరణ్యవాస మిది దద్దయు నొప్పెడు మాకుఁ జూడఁగన్‌.
206
వ. బ్రాహ్మణానుగ్రహంబునం జేసి తొల్లివైరోచనాదు లనేకకాలంబు లక్షయలక్ష్మీవిభవులయి సముద్రనేమి భూచక్రంబు రక్షించిరి; యనిలసహాయుం డయిన యగ్నిదేవుం డరణ్యంబులు దహించునట్లు బ్రాహ్మణ సహాయుం డయిన మహీశుండు శత్రువర్గంబు నిశ్శేషంబు సేయు; వినీతుం డయి విప్రులచేత ననుశాసితుం డయిన రాజునకు నలబ్ధలాభాది త్రితయంబు సంపన్నంబగు; బ్రాహ్మణరహితుం డయి ధర్మహీనుం డయిన రాజును బ్రజ వలవదు; ప్రజానురాగంబు లేనివానికి రాజ్యంబు సుస్థిరంబు గానేరదు; మీరు బ్రాహ్మణప్రియులరు ధర్మనిత్యుల; రెప్పుడును మీ కభ్యుదయం బగు’ నని బకదాల్భ్యుం డరిగినఁ, బాండవులుం దమ యిష్టంబున నుండి దుఃఖోపశమనంబు లయిన కథలు సెప్పుకొనుచున్న యవసరంబున ద్రౌపది ధర్మరాజున కిట్లనియె. 207
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )