పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
రోమశుఁడు ధర్మరాజునకు నష్టావక్రు చరితంబు సెప్పుట (సం. 3-132-8)
క. ‘ఎడఁబడక యహోరాత్రులు | వడిఁగొని చదివింప నిట్లు వలయునె శిష్యుల్‌
గడు నిద్రలేమి నెంతయు | జడమతులై చదువు దప్పఁ జదువుచు నుండన్‌.’
238
వ. అని యుపాలంభించి పలికిన నలిగి యేకపాదుండు ‘నీ వధ్యయనంబునకు వక్రంబుగాఁ బలికితివి గావున నెనిమిదివంకలు గల శరీరంబుతో జన్మింపు’ మని కొడుకునకు శాపం బిచ్చిన. 239
ఆ. అగ్నికల్పుఁడై మహాత్ముఁడు కడుపునఁ | బెరుఁగుచుండె; నంత సరసిజాక్షి
ప్రసవకాల మైనఁ బతి కొక్కనాఁ డిట్టు | లనియెఁ బ్రసవభారమునకు వెఱచి.
240
క. ‘ధరణిఁ గడుఁ బేదవారును | బురిటికి ఘృత తైల ధాన్యములఁ జెచ్చెర ముం
దర సంగ్రహింతు; రవి మన | కరయఁగ నతిదుర్లభంబు లర్థము లేమిన్‌.
241
వ. ఏమి ‘సేయుదు? నెవ్విధంబున నీప్రసవక్లేశంబువలనఁ బాయుదు?’ ననిన నేకపాదుండు ధనార్థియయి జనకరాజుపాలికిం జని వాని యజ్ఞంబునందు వరుణపుత్త్రుండైన వందితో వివాదంబు సేసి యోటువడి జలమగ్నుండై యున్న, నిట సుజాత ప్రసూతియై యష్టావక్రుం గనియెఁ; దత్కాలంబున నుద్దాలకుభార్య శ్వేతకేతుం గనియె; నిట్లు మాతులభాగినేయు లిద్దఱు సవయస్కులై పెరిఁగి పండ్రెండేండ్లొక్కట నుద్దాలకుతోఁ జదివి యధ్యయనశూరులై రందు. 242
తే. తండ్రి యనుచు నుద్దాలకుఁ దనకుఁ, గరము | ప్రీతితో శ్వేతకేతుని భ్రాత యనుచు
ననఘచరితుఁ డష్టావక్రుఁ డనుదినంబు | నొం డెఱుంగక సుఖలీల నుండు నంత.
243
వ. ఒక్కనాఁ డుద్దాలకు కుఱు వెక్కియున్న యష్టావక్రుం జూచి శ్వేతకేతుండు సహింపక ‘నీ వేల మాయయ్య కుఱువెక్కి యుండె? దీవు వోయి మీయయ్య కుఱు వెక్కు’ మని చేయిపట్టి యీడ్చిన, నేడ్చుచుం దల్లికడకుం జని యష్టావక్రుం డిట్లనియె. 244
క. ‘మా యయ్య యెవ్వ? రెక్కడఁ | బోయిరి? సెప్పు’ మని తెల్లముగ నడిగి తప
శ్శ్రీయుతుఁడు తండ్రికడకుం | బోయెం దన మామ నెయ్యమునఁ దోడ్కొనుచున్‌.
245
వ. ఇ ట్లష్టావక్రుండు దానును శ్వేతకేతుండును జనకరాజు యజ్ఞంబునకుం జని యందు దౌవారిక నివారితులై ‘మూకాంధ బధిర పంగు స్త్రీ బ్రాహ్మణ సుప్రవేశం బగుచున్న యీ రాజద్వారంబున మమ్ము విద్వాంసుల బ్రాహ్మణుల నేల వారించెద?’ రనిన దౌవారికుం డిట్లనియె. 246
క. ‘అలఘులగు వృద్ధవిద్వాం | సులకు మహాయాజ్ఞికులకుఁ జొర నర్హంబై
విలసిల్లు యజ్ఞసభ సొర | వలవదు చనుఁ; డీరు చిఱుతవారల’ రనినన్‌.
247
క. ‘అలయక యేండ్లు గడుం బె | క్కులు జీవించుట నర గలుగుటయుం దగు వృ
ద్ధుల లక్షణమే? జ్ఞానము | గలఁ డేనిన్‌ బాలుఁ డయినఁ గడు వృద్ధు మహిన్‌.
248
వ. కృతాధ్యయనశీలుండై యాచారపరుండైన వాఁడు బాలుండయ్యును సర్వజన సంభావనీయుండగు; బాలురని మమ్ము నవమానింప వలవ; దేము జనకరాజ సదనంబున దర్పితులైన వేదవాదులతో వాదంబు సేయ సమకట్టి వచ్చినవార’ మనిన దౌవారికుండు వారి నప్పుడు రాజానుమతుండై లబ్ధప్రవేశులం జేసె; నంత. 249
సీ. జనకభూపాలుని సంప్రశ్నముల కెల్ల | నేర్పడ నుత్తరం బిచ్చి వాని
సభయందు భూసురసంఘమధ్యంబున | వరుణపుత్త్రుం డైన వందితోడ
వాదంబు చేసి, గర్వంబున నాతని | నొడిచి, తద్విజితులై యొదిఁగియున్న
ధరణీసురులఁ దన తండ్రితో నిగ్రహ | ముక్తులఁ జేసి సన్మునికుమారుఁ
 
తే. డధికతేజుఁ డష్టావక్రుఁ డఖిలలోక | పూజితుం డైన జనకుచేఁ బూజ లంది
యేకపాదుఁ దోడ్కొని పేర్మి నేఁగుదెంచె | బుధనుతుండు నిజాశ్రమంబునకు నొప్ప.’
250
వ. అని చెప్పుచు నరిగి, ‘యిది సమంగ యను పుణ్యనది; యిందు భరతుండు రాజ్యాభిషిక్తుఁడయ్యెఁ; దొల్లి యింద్రుండు లక్ష్మీప్రాప్తుండై దీని జలోపస్పర్శనంబునఁ బాపవిముక్తుండయ్యె; నిది మైనాకకుక్షి; యిం దదితి పుత్త్రార్థినియై తపంబు సేసె; నిది ఋషిదైవతంబైన కనఖల నగం; బిది గంగానది; యిందు సనత్కుమారుండు సిద్ధింబొందె; నిది యుష్ణగంగ; యిందుఁ గృతస్నానులైనం గృతార్థు లగుదు; రిది రైభ్యాశ్రమం; బిది భరద్వాజాశ్రమం; బిందు భరద్వాజసుతుండు యవక్రీతుండు తపోవిద్యాగర్వంబున నపగతజీవుం డయ్యె; ననిన ‘నది యె?’ ట్లని ధర్మతనయుం డడిగిన రోమశుం డిట్లనియె. 251
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )