పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
రావణుఁడు సీత నెత్తికొని లంకకుఁ బోవుట (సం. 3-262-39)
వ. అని పలుకుచు నొయ్యనొయ్యన తొలంగం జనిన నద్దురాత్ముఁ డతిభయంకరంబుగా జంకించి యమ్మగువం బట్టికొని గగనంబున కెగసి లంకాపురాభిముఖుండై యరుగఁ దొడంగిన నయ్యింతి యెంతయుం దలరి యిట్లని విలాపంబు సేసె. 342
ఉ. ‘దేవతలార! యో ధరణిదేవతలార! జగత్త్రయోన్నతుం
డై వెలుఁగొందు రామునికులాంగన జానకి నేను; నన్ను మో
హావిలుఁ డొక్క రక్కసుఁ డనర్గళుఁడై కొనిపోయెడుం; గృపం
గావరె! పుణ్యమున్‌ యశముఁ గైకొనరే! యిదె మీకు మ్రొక్కెదన్‌’.
343
క. అని యేడ్వఁగఁ దద్వచనము | లనఘుఁడు గిరిగహ్వరాంతరాలయగతుఁడై
విని యరుణసుతుఁడు తేజో | ఘనుఁడు జటాయు వను పక్షి కారుణ్యమునన్‌.
344
క. ఎఱకలు గల కులశైలము | తెఱఁగు మెయిన్‌ రయము మెఱయ దివికి నెగసి బె
ట్టుఱుము జలధరముక్రియ ను | క్కఱి భువనం బెల్ల నద్రువ నార్చుచుఁ గడిమిన్‌.
345
ఉ. ‘ఓరి దురాత్మ! యీ యబల నోడక యేటికిఁ బట్టినాఁడ? వం
భోరుహనేత్ర విడ్వు; మెట వోయినఁ బ్రాణముఁ గొందు నింక; ను
గ్రారివిభేదివిక్రము జటాయు నెఱుంగవె?’ యంచు దర్పదు
ర్వారుఁడు వీఁకఁ దాఁకె సురవర్గవిఘాతకు నద్దశాననున్‌.
346
మ. ఘనపక్షాహతులం బ్రకాండపరిఘాఘాతంబులం దీవ్రశా
తనఖోచ్ఛేదములం బ్రదీప్తశరవేధక్రీడలం గ్రూరచం
చునిపాతంబులఁ బ్రౌఢకుంతముఖవిస్ఫోటంబులం దత్ఖగేం
ద్రనిశాటేంద్రుల పోరు సాధనసమత్వస్ఫూర్తి నొప్పెం గడున్‌.
347
చ. పటుతరపక్షిపక్షముఖపాదనఖప్రవిఘాతఖండిత
స్ఫుటితశరీరుఁడై బహుళశోణితధారలు మేనఁ గ్రమ్మఁగాఁ
దటసముపాంతనిర్గళితధాతురసారుణసాంద్రనిర్ఝరో
త్కటకులశైలలీల దశకంఠుఁడు నిల్చె నకుంఠితస్థితిన్‌.
348
వ. తదనంతరంబ. 349
క. తెఱపి గని దానవేశ్వరుఁ | డుఱక కృపాణమున నాఖగోత్తము నెఱకల్‌
నఱకినఁ గూలె నతం డిల | నఱవఱలై పవనహతమహాభ్రమ పోలెన్‌.
350
వ. ఇట్లు జటాయువుం గూల్చి రావణుం డధికరయంబున నరుగునెడ జానకి తనకు దిక్కెవ్వరు లేమిం జేసి నిరాశయై యొక్కశైలశృంగంబునందుఁ గొందఱు వానరులు మెలంగుచున్నంగని, తన కట్టిన పుట్టంబుకొంగు సించి భూషణంబులు ముడిచి తత్ప్రదేశంబున వైచెం; బంక్తివదనుండును లంకాపురంబునకుం జని యం దశోకవనమధ్యంబున నాసుమధ్య నునిచి, తదీయరక్షణార్థంబు రాక్షసీనివహంబు నియోగించె; నిట రాఘవుండు మాయామృగంబు వధియించి మగుడం జనుదెంచువాఁడు దన కెదురుగా వచ్చు లక్ష్మణుం గని ‘రాక్షస గోచరం బైన వనంబున జానకి నొంటి యునిచి వచ్చి తప్పుసేసి’ తని పలుకుటయు, సుమిత్రానందనుండు ధాత్రీతనయ తన్ను నవమానించి పలికిన తెఱంగు సెప్పిన. 351
మధురాక్కర కనకమృగ మట్లు దను దవ్వుగాఁ ద్రిప్పి తెచ్చుటకు,
వనజముఖి నేకతమ శూన్యవనమునయం దునిచి
వెనుక ననుజుండు వచ్చిన విధమునకు, మదిలోన
ననఘుఁ డెంతయు వగచుచు నరిగె నాశ్రమమునకు.
352
వ. అట్లు సని చేతనారహితం బైన శరీరంబునుంబోలె సీతావిహీనంబయి యున్న పర్ణగృహంబుం గనుంగొని రాఘవుండు మూర్ఛితుండై, లక్ష్మణ ప్రయత్నంబునఁ గొండొకవడికిఁ దెలివొందె; నంత నయ్యన్నయుం దమ్ముండును దత్ప్రదేశంబులయందు సుందరిం దడవుచుం జనువారు ముందట. 353
తే. కులిశపాతభంగుర మైన కులనగంబు | కరణిఁ బడియున్న గృధ్రంబుఁ గాంచి బుద్ధి
నదియు రాక్షసమాయయౌ నని తలంచి | యేయ సమకట్టుటయు విహగేంద్రుఁ డెఱిఁగి.
354
క. ‘ఓయయ్యలార! యేను జ | టాయు వనంబరఁగు పక్షి నరుణతనయుఁడన్‌
మీయయ్య దశరథక్షితి | నాయకునకుఁ బ్రియసఖుండ’ నావుడు వారల్‌.
355
వ. డాయ నరుగుదెంచుటయు నతండు వారితో రావణుండు వైదేహిం గొనిపోవుటయుఁ, దదర్థంబై తాను నద్దనుజుం దొడరి పెనంగుటయుం జెప్పి, యావల రావణుం డరిగినదెస నెఱింగించి విగతజీవుం డయ్యె; నయ్యిరువురు నప్పులుఁగుఱేనికి నతిగౌరవంబున నగ్నిసంస్కారాదికరణీయంబులు నిజజనక నిర్విశేషంబుగా నాచరించి దక్షిణాభిముఖులై చని చని. 356
చ. ఉరమునయందుఁ గన్నులుఁ బృథూదరదేశమునందు నోరుఁ బ్ర
స్ఫురితభుజద్వయంబుఁ గులభూమిధరోన్నతభావముం గరం
బరుదుగ నుగ్రమైన వికృతాకృతితోడ నశేషసత్త్వఘ
స్మరుఁ డగుచున్నవానిఁ బటుసత్త్వుఁ గబంధునిఁ గాంచి రచ్చటన్‌.
357
ఆ. అక్కబంధుఁ డామిషార్థియై లక్ష్మణుఁ | బట్టికొనియె బాహుబల మెలర్ప;
నతఁడు గడువిషణ్ణుఁడై ‘యన్న! ననుఁ జూడు’ | మనుచు రాముఁ జూచి యనియె మఱియు.
358
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )