పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము
అగస్త్యుఁ డింద్రునకు నహుషుభ్రష్టతఁ దెలుపుట (సం. 5-17-7)
వ. అనిన విని యమ్మునీంద్రుం డిట్లనియె; ‘నన్నహుషుని మోచి వేసరుచున్న మును లతనికడ గోష్ఠీ వినోదంబుల నుండి ‘బ్రాహ్మణంబు లయిన మంత్రంబులు గోసంప్రోక్షణంబునందుఁ జెప్పంబడియుండు; నవి నీకుఁ బ్రమాణ భూతంబు లగునే?’ యని యడిగినం, బాపనిశ్చయుండై యతం’ డమ్మంత్రంబులు ప్రమాణంబులు గా’వనిన నే నమ్మాట నిషేధించి, ‘పూర్వాచార్యులచేత నభినందితంబులగు మంత్రంబులు నిందించుట యజ్ఞానం’బని వివాదంబు సేసితి; నతండు కోపించి మదీయ మస్తకంబు దన్నె; నతనిం గనుంగొని, పుణ్యహీనుండును, దేజోహాని దీనుండును నగుట యుపలక్షించి, ‘నీవు పూజనీయులయిన మహామునుల నిన్ను వహింపం బనిచితి; వారలు గొనియాడు మంత్రంబులు గర్హించి; తదియునుంగాక నన్ను నవమానించితి; గావున నింద్రపద భ్రష్టుండవై బహుసంవత్సరంబులు భూలోకంబున నురగరూపంబున నుండు’ మని శాపం బిచ్చి, పదంపడి యనుగ్రహించి, ‘భవదీయవంశజాతుండయి యజాతశత్రుం డను పెంపుగలిగి యుధిష్ఠిరనామధేయుండైన యొక్క సత్పురుషుని సందర్శనంబున దురితంబులఁ బాసి పుణ్యలోకంబు వడయువాఁడ’ వనినఁ, దత్‌క్షణంబ. 201
క. స్వర్గ పరిభ్రష్టుండై | దుర్గతికిం బోయె నతఁడు; దుష్టాత్ములకున్‌
దౌర్గత్యము, సుజనులకు న | నర్గళ సద్గతియు నగుట యరుదే యెందున్‌?’
202
మ. అనినన్‌ దేవతలుం దపోధనులు నత్యానందముం బొంది; రా
మునిఁ బూజించె నమర్త్యనాథుఁడు మనోమోదంబు సంధిల్ల, న
య్యనురాగంబు చరాచరంబులకు హృద్యం బయ్యెఁ; సర్వాప్సరో
జనముం గౌశికుఁ గానవచ్చె సుభగైశ్వర్యంబు శోభిల్లఁగన్‌.
203
వ. తదనంతరంబ. 204
ఉ. పావకుఁ డాదిగా దిగధిపాలురుఁ, గిన్నర సిద్ధ సాధ్యులున్‌,
దేవగురుండుఁ దోన చనుదేరఁగ, వైభవ ముల్లసిల్ల, నై
రావణ దంతి నెక్కి యమరావతికిం జని, యింద్రుఁ డా శచీ
దేవియుఁ దాను మోదమునఁ దేలి రభీష్ట వినోద లీలలన్‌.
205
వ. ఇవ్విధంబున మహానుభావుం డగు నమ్మహేంద్రుండు. 206
క. ఆజ్ఞాభంగం బయినం | బ్రాజ్ఞేతరునట్లు దుఃఖపడి యుండఁడె? తా
నజ్ఞాతవాసమును గా | లజ్ఞతఁ జలుపండె? యన్యులకు వగపేలా?
207
క. కావున మీ పడిన యర | ణ్యావాస క్లేశమునకు, నజ్ఞాత విధిన్‌
సేవకుల రైన దానికి | నోవకుఁడీ మీరు లఘుమనోవృత్తులరై.’
208
వ. అని యిట్లు సెప్పి శల్యుండు సభాసదులం గలయం గనుంగొని. 209
ఉ. కౌరవనాథుఁ డా నహుషుకైవడి నాశముఁ బొందు; వాసవ
శ్రీ రమణీయుఁడై జయము సేకొని ధర్మజుఁ డంబురాశి వే
లా రశనా సముజ్జ్వల విలాస మనోహర మేదినీ వధూ
సార సమగ్ర భోగముల సన్నుతి కెక్కెడుఁ దానుఁ దమ్ములున్‌.
210
వ. అని పలికి వెండియు నతండు పాండవాగ్రజున కిట్లనియె. 211
క. ‘సౌఖ్యంబులు వొందు, జగ | త్ప్రఖ్యాతులుఁ జెందుఁ, దగఁ బురందర విజయో
పాఖ్యానము విన్నను, ద | ద్వ్యాఖ్యానము సేసినన్‌ జనావలి కనఘా!
212
క. మోహరము నడచుచుండఁగ | నీ హరి విజయంబు విను నరేంద్రుఁడు రిపు సం
దోహంబు గెల్చుటకు సం | దేహం బించుకయు లేదు ధీరవిచారా!’
213
వ. అనిన విని ధర్మనందనుండు మద్రపతిం బ్రస్తుతించి ‘మహానుభావా! భవదీయ భాషణ శ్రవణంబునఁ జిత్తంబు కలంక దేఱె’ నని సంభావించి యతనికి సముచితంబులగు మజ్జన భోజనంబు లొనరించి, యనంతరంబ యతండు పయనంబునకు నుద్యోగించిన. 214
ఆ. అతని ననుప నేఁగి యధిక సంప్రీతి నే | తెంచునప్పు డయ్యుధిష్ఠిరుండు
‘రణములోన మీరు రాధేయుఁ బలుకుట | మఱవకుండవలయు మమ్ముఁ దలఁచి.’
215
క. అనుటయు మద్రేశ్వరుఁ డా | తని నూఱడఁ బలికి గాఢతరముగ నాలిం
గన మొనరించి చనియె హ | స్తినాపురికి బలముతో నతిత్వరితగతిన్‌.
216
వ. అట్టి యవసరంబున. 217
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )