| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 24. శ్రీమతి | |
| (రవీంద్రుని "Fruit Gathering" నుండి) | |
|
పచ్చ బంగారు వెలుగులు పరచి పరచి శారద దినాంతలక్ష్మి ముచ్చటలు సేయ బుద్ధ భగవాను నాలయమున జనంబు సభయ పూజాంజలు లొసంగు సమయమయ్యె. | |
|
బిందుసార మహారాజు పెద్దకాల మవని పాలించి దివి కేగి నంతనుండి రాజ మహిళలు పోవరు రోజు రోజు బుద్ధమూర్తికి మలుసంజ పూజసేయ. | |
|
ఆలయమందు దివ్వె వెలు గందుట తప్పనె బిందుసార భూ పాల కుమారు డప్పటి నృ పాలుడు; బౌద్ధ మహాప్రబంధముల్ కాలిచివైచె; నెత్తుటి క లమ్మున పైతృక శాసనావళిన్ వాలుపు గీతలన్, కరకు వారిన చేతల కొట్టివైచెనున్. | |
|
మానసమందు భక్తి ఘన మై తగ, పుణ్యనదీ జలమ్ములన్ స్నానము చేసి రాణి పరి చారిక 'శ్రీమతి' ఫుల్లమల్లికా సూన మనోజ్ఞ మాలికలు, చుక్కలవోని ప్రదీప కోరక శ్రేణులు పైడి పళ్ళెమున జేరిచి రాణిని చూడ వచ్చెనున్. | |
|
"బుద్ధ దేవాలయమునకు పూజ సేయ పోవు వారికి మరణశిక్షా విధంబు వినుమి రాజాజ్ఞ యిది" యని వినిచె, మేను జలదరింపగ శ్రీమతీ సతికి రాణి. | |
|
రాణికి నమస్సు చేసి పారాణ చెడని కొత్త పెండ్లికూతురు రాచకొమరు భార్య 'అమిత' యుండెడి సౌధాన కరుగుదెంచె శ్రీమతి, ప్రబుద్ధ భక్తిమచ్ఛ్రీమతి యయి. | |
|
తొడపయి జాళువా మెరుగు తొన్కెడి అద్దము నుంచి, చొళ్ళెపున్ ముడి విడవైచి, పాపటను ముక్కుకు సూటిగ తీసి, కస్తురీ తిలకము భాగ్య చిహ్న మటు దిద్ది మొగమ్మున, నవ్వుచున్న అ ప్పుడు 'చమితా లతాంగి' భయ పడ్డది శ్రీమతి జూచి నంతనే. | |
|
"కత్తి మెడపైకి తెచ్చితి కాదె! ఏమి ఈ భయంకర బుద్ధ పూజా భరంబు!" అను చమితభీతి 'అమిత' వాకొనుట చూచి శ్రీమతి చనె శుక్లకుమారికను చూడ. | |
|
కిటికీ చెంత దినాంత శాంత రవి రుక్ కిర్మీర కాంతిన్ పుటం బుట శృంగారపు కావ్యమున్ చదువుచున్ మోహావమగ్నాంతరో త్కట తాపోచ్ఛ్వసనమ్ములన్ జెలగు శు క్లాదేవి భీతిల్లి వా కిట పూజాతుర శ్రీమతిన్ గనగనే కేల్జార్చె కావ్యమ్మునున్. | |
|
"ఓసి! ఇది యేమె? యౌవనాభ్యుదయమైన నీ వయసు మిత్తి కాహుతి కావలెసెనె?" అనుచు శుక్లాకుమారిక గొణుగుట విని విసిగి శ్రీమతి రాణుల విడచి పోయె. | |
|
"రాజమహిళా లలామలు! పూజ సేయ మోజు కలదేని లెండు, నోముకొన రండు బౌద్ధ దేవాలయమునకు వచ్చి పొండు" అనుచు శ్రీమతి యెలుగెత్తి అరచుచేగె; | |
|
కొందరు నవ్వినారు గృహ కుడ్యము పైపయినుండి తొంగుచున్, కొందరు గేలి చప్పటలు కొట్టుచు మూసిరి తల్పురెక్కలన్; చందనమున్ సుమమ్ములును చక్కని చుక్కలవోని దీపికల్ తొందరసేయ ఆలయము త్రోవన శ్రీమతి పోవ సాగినన్. | |
|
రాజ శుద్ధాంత గోపురాగ్రాన అపర భాస్కరుని తుది కిరణమ్ము వాడిపోయె; వాడ వాడల నీడలు ప్రాకి పోయె; అపర సంధ్యా మహాపూజ కయ్యె సమయ మనగ జేగంట మ్రోగె శివాలయాన; సమసె కోలాహలమ్ము నిశ్శబ్దమందు. | |
|
శారద రాత్రి నిమ్న హ్రద సన్నిభమై కనుపట్టె; వెల్గులన్ తారలు తేరి చూచె విను దారుల; బుద్ధ నికేతనమ్మునన్ బారులు దీరి దివ్వె లగు పట్టెను చీకటిలోన; రాడ్భటుల్ పారుచు పోయి రుక్కు కర వాలము లొక్కతరిన్ తళుక్కనన్. | |
|
"మృతికి జడియనిదాన వెవ్వతెవె నీవు?" అని అరచినారు భటులు - తీయని స్వనంబు "శ్రీమతిని, బుద్ధదేవార్పితామృతాంత రాత్మ దీపికాంకూరము" ననుచు వినిచె. | |
|
యెర్రవారెను శ్రీమతీ హృదయ రుధిర సిక్త ధవళస్ఫటిక శిలాసీమ; మలిగి పోయె నిశ్శబ్ద తారకాచ్ఛాయలందు దివ్య బుద్ధాంత్య పూజా ప్రదీప కళిక. | |