| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 25. క్షమామూర్తి | |
|
హిమగిరి శిఖాముఖాన వెల్గించినావు దివ్య దీపాంకురము; దేశ దేశములకు యుగ యుగమ్ముల చీకటు లుడిగిపోవ గుండెలోనుండి నెత్తురుల్ పిండిపోసి. | |
|
నలుబది కోట్ల భారత జ నమ్ముల వందలయేండ్ల బంధన మ్ములు సడలించినావు, జయ ముల్ గొనినావు, త్రివర్ణకాంతులన్ తళతళ లాడు భారత ప తాకము నాకము తాకుంత యె త్తుల కెగయించినావు; పగ తుర్ కొనియాడగ పెంచినాడవున్. | |
|
మతముల గ్రుద్దులాటలను మాన్పు ప్రతిజ్ఞలతో ప్రజా సమే కతకయి ప్రాణ మొడ్డిన మ హాత్ముడ వీవు; భవిష్యకాల సం తతు లఖిల ప్రపంచ జన తా నయనాంచలవీధి నీ మహో న్నత దరహాసమూర్తి పయ న మ్మొనరింప దృశించ జాలరే! | |
|
కాలసవిత్రి వందల యు గమ్ముల భీషణ గర్భవేదన జ్వాలలలో సుఖప్రసవ సౌఖ్యము నందెను నీవు భూమిపై కా లిడగానె; భారత జ గజ్జననీ నయనాల నెత్తురుల్ జాలయిపారె నీవు దివి షత్పుర మార్గములందు కాలిడన్. | |
|
పల్లెల గొల్లవాడవయి పాలను త్రావెదు; ధోతిగుడ్డ మో కాళ్ళను దాటనీయ; వొక కఱ్ఱను చేతికి నూతజేసి ఊ ళ్ళూళ్ళకు శాంతికుంభము భు జోపరిభాగముపై, అహింసయన్ చల్లల నమ్మబోయెదవు, స్వామి! నరాకృతి సత్యదైవమా! | |
|
నీల నీలాకాశ ఫాలభాగము నుండి రవిబింబ కుంకుమచ్ఛవులు రాలె భూదేవతా రమ్య పాద మంజీర శిం జా గుంజనమ్ము లశ్రావ్య మయ్యె. | |
|
స్వాతంత్ర్యకన్యా నవన్నవ వైవాహ వేదిపై నెదొ దుఃఖ నాద మలరె లోకకంటక జనానీక ఘూక వికార హేళన ధ్వనులు విన్పింపసాగె | |
|
చేతులారగ నీవు పెంచిన స్వతంత్ర నాగవల్లికయే విషనాగ మయ్యె; నీ గళము చుట్టి ప్రాణాలు లాగివేసె, భారతీయుల గౌరవ ప్రతిభ మాసె. | |
| (1948 జనవరి 30 వ తేదీన నిజామాబాదు జైలులో రచితము) | |